ముందస్తుపై చర్చ నిజమే

TRS MP Vinod Kumar On Advance Elections - Sakshi

ఎంపీ వినోద్‌కుమార్‌ స్పష్టీకరణ

అసెంబ్లీ రద్దయితే ఎన్నికలు ఎప్పుడనేది ఈసీ నిర్ణయిస్తుంది

సాక్షి, న్యూఢిల్లీ: ముందస్తు ఎన్నికలపై చర్చ నిజమేనని, ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. అయితే ఇందుకు ఎలాంటి ముహూర్తాలు పెట్టలేద ని, కేవలం మీడియాలోనే కల్పిస్తున్నారని పేర్కొ న్నారు. అసెంబ్లీ రద్దయితే ఎన్నికలు ఎప్పుడు ఉంటాయనే అంశం ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుందని అన్నారు. అసెంబ్లీ రద్దయితే ఆరు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఇది స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో బూర నర్సయ్యగౌడ్‌తో కలసి వినోద్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ముందస్తు ఎన్నికలపై చర్చలు జరుగుతున్న మాట నిజమే. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్‌ ఆలోచించి అసెంబ్లీని రద్దుచేయాలనుకుంటే చేయొచ్చు.. కానీ ఎన్నికలను ఎప్పుడు పెట్టుకోవాలన్న నిర్ణయం మాత్రం ఎన్నికల కమిషన్‌దే. మేం ప్రధానమంత్రిని కలసినా, హోం మంత్రిని కలసినా, ఇంకెవరిని కలసినా తెలంగాణ రాష్ట్ర సమస్యలపైన మాత్రమే కలుస్తున్నాం. నాలుగేళ్లుగా ఇదే చేస్తున్నాం’’అని పేర్కొన్నారు.

సెప్టెంబర్‌ 28 గడువు
వచ్చే నెలలో శాసనసభ సమావేశాలు ఉంటాయా? లేక అంతకుముందే అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు వినోద్‌ సమాధానమిస్తూ ‘‘తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ఆరు నెలల గడువు ఈ సెప్టెంబర్‌ 28తో ముగుస్తుంది. ఆ లోపు శాసనసభ సమావేశం జరపాలి. లేదా అంతకుముందుగానే అసెంబ్లీ రద్దు కు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంటే అసెంబ్లీ రద్దవుతుంది’’అని వివరించారు. .  

6 నెలల్లోపు ఎన్నికలు జరపాల్సిందే
అసెంబ్లీ రద్దు చేసినా ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనేదీ లేదని.. అసెంబ్లీ గడువు ఉన్నంత వరకూ ఎన్నికలను పొడిగించవచ్చన్న అభి ప్రాయంపై వినోద్‌ స్పందిస్తూ ‘‘తప్పనిసరిగా అసెంబ్లీ రద్దయిన 6 నెలల్లోపు ఎన్నికలు జరపాలి.  ఇది గుజరాత్‌ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విషయం.  అసెంబ్లీ రద్దయినప్పుడు అప్పటివరకు మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగించాలని కరుణానిధి కేసులో సుప్రీం చెప్పింది. వాటిపై మాకు స్పష్టత ఉంది’’అని వివరించారు.

ఈసీ ప్రతిపాదనకు టీఆర్‌ఎస్‌ ఓకే: వినోద్‌
పార్టీ పరంగా ఏర్పాటు చేసే వివిధ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కేటాయించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనను టీఆర్‌ఎస్‌ పార్టీ సమ్మతిస్తుందని ఎంపీ వినోద్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల సంస్కరణలపై కేంద్ర ఎన్నికల సం ఘం సోమవారం ఢిల్లీలో జాతీయ, ప్రాంతీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు ప్రతిపాదనలపై ఆయా పార్టీల అభిప్రాయాలను తెలుసుకోనుంది. దీనిపై ఆదివారం ఢిల్లీలో వినోద్‌ మాట్లాడుతూ.. పార్టీలో మహిళలకు తగిన ప్రా« దాన్యం కల్పించాలని ఈసీ చేసిన ప్రతిపాదనను టీఆర్‌ఎస్‌ సమ్మతిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చులపై పరిమితులున్నాయని, అయితే ఎమ్మెల్సీ అభ్యర్థు లకు పరిమితులు లేని నేపథ్యంలో వీటిపై కూడా పరిమితులు విధించే అంశమై ఈసీ అభిప్రాయం కోరిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులపైనే కాకుండా రాజకీయ పార్టీల ఖర్చులపై కూడా పరిమితి విధించే ప్రతిపాదన చేసిం దని వెల్లడించారు. అలాగే ఓటర్ల నమోదును నిర్దిష్ట కాలంలోనే కాకుండా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిరంతరాయంగా నమోదు ప్రక్రియ జరిగేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండంపై అభిప్రాయం కోరిందన్నారు. వీటన్నింటిపై సమావేశంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top