ప్రజా సంకల్పయాత్రతో టీడీపీ నేతల్లో వణుకు

Shake in the TDP leaders with the Prajasankalpayatra - Sakshi

అందుకే దుష్ప్రచారం చేస్తున్నారు: బుగ్గన ధ్వజం

ప్యాపిలి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర టీడీపీ నేతల్లో వణుకు పుట్టిస్తోందని పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అందుకే బీజేపీతో పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లా ప్యాపిలి ప్రభుత్వాస్పత్రిలో తన సొంత నిధులతో చేపట్టిన ‘బుగ్గన ఆరోగ్య భవన’ నిర్మాణానికి వైఎస్సార్‌ సీపీ నేత, రిటైర్డ్‌ ఐజీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌తో కలిసి ఆదివారం ఆయన భూమి పూజ చేశారు. సభలో బుగ్గన మాట్లాడుతూ.. చంద్రబాబులాంటి అవకాశవాద రాజకీయాలు, మోసపూరిత మాటలు వైఎస్‌ జగన్‌కు తెలియవన్నారు.

పూటకోమాట మాట్లాడటం, గడియకో నిర్ణయం తీసుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో తిరిగిన చంద్రబాబు.. కేంద్రం అందించిన నిధులను దోచుకున్నారని ఆరోపించారు. పాదయాత్రగా తమ వద్దకు వస్తున్న జననేత జగన్‌తో గోడు వెళ్లబోసుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో మీ వెంటే ఉంటామని చెబుతున్నారని బుగ్గన పేర్కొన్నారు. టీడీపీ పెద్దలు కొనసాగిస్తున్న అవినీతి, అక్రమాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీరాములు, దిలీప్‌ చక్రవర్తి, సర్పంచ్‌ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top