దామోదరకు భద్రత ఉపసంహరణ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహకు పోలీసు భద్రతను ఉపసంహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా పోలీసు కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఎస్పీ శనివారం దామోదర వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఉపసంహరణకు సంబంధించి దామోదరకు జిల్లా పోలీసులు సమాచారం అందించారు.
హైదరాబాద్లో నివాసం ఉంటున్న దామోదరకు ప్రస్తుతం వన్ ప్లస్ వన్ భద్రత కల్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయనకు ఇద్దరు గన్మన్లు రక్షణగా ఉంటున్నారు. భద్రత ఉపసంహరణ తమ పరిధిలోని అంశం కాదని, ఇంటెలిజెన్స్ సూచనల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. దామోదరకు భద్రతను ఉపసంహరిస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదివారం జోగిపేటలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టనుంది.