
పార్లమెంట్ ఎదుట ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలు. చిత్రంలో బొత్స
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో అవిశ్వాసం ప్రస్తావనకు రాగానే వెల్లో ఉన్న ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనను రెట్టింపు చేయడంతో వరుసగా గురువారం ఐదోసారి కూడా తీర్మానాలు ప్రవేశపెట్టకుండానే లోక్సభ వాయిదాపడింది. వైఎస్సార్ సీపీ, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను సభ సజావుగా లేదన్న కారణంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించలేదు.
సభాపతికి అడ్డంగా ప్లకార్డులు
లోక్సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే వెల్లోకి వెళ్లిన ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగటంతో అప్పటికే ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన స్పీకర్ కొద్దిక్షణాల్లోనే వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు సభ పునఃప్రారంభం కాగానే వివిధ శాఖలకు సంబంధించిన పత్రాలను మంత్రులు పార్లమెంట్కు సమర్పించారు. సభ్యులంతా తమ స్థానాల్లోకి వెళ్లాలని, అవిశ్వాస తీర్మానం సహా అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్కుమార్ పేర్కొన్నారు. ఈ సమయంలో ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు వెల్లోనే ఉన్నారు. 12.06 గంటలకు సభాపతి అవిశ్వాస తీర్మానం నోటీసులను ప్రస్తావించగానే ఏఐఏడీఎంకే సభ్యులు రెట్టింపు గొడవతో ఓ.. ఓ.. అంటూ శబ్దాలు చేశారు. టీఆర్ఎస్ సభ్యులు కూడా సభాపతికి అడ్డంగా నిలుచుని ప్లకార్డులు ప్రదర్శించారు. పరిస్థితి ఇలా ఉండగానే సభాపతి తీర్మానాన్ని ప్రస్తావించారు. ‘కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి, తోట నరసింహం నుంచి నోటీసులు అందాయి. వీటిని సభ ముందుంచడం నా బాధ్యత. తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన 50 మంది సభ్యులు వారి స్థానాల్లో నిలుచుంటే లెక్కించేందుకు వీలుగా సభ సజావుగా నడవాలి. అప్పుడే లెక్కించి తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలో లేదో నిర్ణయించగలను. సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలి..’ అని పేర్కొన్నారు.
మద్దతుగా నిలుచున్న విపక్ష ఎంపీలు
అవిశ్వాస తీర్మానం ప్రస్తావన రాగానే విపక్ష సభ్యులంతా మద్దతుగా నిలుచున్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సమాజ్వాదీ, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ, తదితర విపక్షాలకు చెందిన సభ్యులంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా లేచి నిలుచున్నారు. అయితే సభ సజావుగా లేనందున అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అనుమతిని తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంటూ స్పీకర్ లోక్సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలో ప్రత్యేక హోదాపై చర్చకు అవకాశం ఇవ్వాలని రాజ్యసభ చైర్మన్ను కోరుతూ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తన స్థానంలో నిలుచుని అభ్యర్థించారు. అయితే వెల్లో వివిధ పక్షాల ఆందోళనతో కొద్ది క్షణాల్లోనే సభను రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారానికి వాయిదావేశారు.
ఆరోసారి అవిశ్వాసం నోటీసులు
కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం గురువారం మధ్యాహ్నం లోక్సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు ఆరోసారి నోటీసులను అందజేశారు.
పార్లమెంట్ వద్ద ఎంపీల ధర్నా
అంతకుముందు ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్ సీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వై.ఎస్.అవినాష్రెడ్డి, పి.వి.మిథున్రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. టీడీపీ ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.