
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి
సాక్షి, కర్నూలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ, ప్రత్యేక హోదా తెస్తామన్న టీడీపీలు ఆంధ్రప్రదేశ్ని ఘోరంగా మోసం చేశాయని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తోంది ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమేనని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి చేసిన మోసాలకు ప్రజలే బుద్ధి చెబుతారని గోపాల్ రెడ్డి అన్నారు.
మోదీ పాలనలో ఏటీఎంలు మూతపడితే.. చంద్రబాబు పాలనలో నిరుద్యోగులు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. టీడీపీ పాలనలో సుమారు లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అన్న చంద్రబాబు ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లలో పేదలకు అన్నం దొరకడం లేదు.. ఒకటి ఉంటే మరొకటి ఉండని పరిస్థితి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికినా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. దీనిపై గవర్నర్ ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని అన్నారు.