‘చంద్రబాబుకు రాజకీయ సమాధి కడతారు’

MLA Visweswara Reddy criticised chandrababu ruling in AP - Sakshi

అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు నిర్ధాక్షిణ్యంగా మోసం చేశారు

ప్రజల కష్టాలను తీర్చడమే అసలైన అనుభవం

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను చూస్తే ఎందుకు భయపెడున్నారో?

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

సాక్షి, అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తనకు ఓట్లేసిన అన్ని వర్గాల ప్రజలను సీఎం అయ్యాక చంద్రబాబు నిర్ధాక్షిణ్యంగా మోసం చేశారని విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం, నల్లమడలో వైఎస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన బహిరంగసభలో ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ‘శాసనసభలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల నోరు నొక్కడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రజల మద్ధతుతో మేం ముందుకు సాగుతున్నాం. అందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు భారీ సంఖ్యలో తరలివస్తున్న ప్రజానీకమే అందుకు నిలువెత్తు నిదర్శనం. తమ సమస్యలను జననేత వైఎస్ జగన్‌కు చెప్పుకొనేందుకు ప్రతిచోటా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ప్రజా ప్రతినిధులను గౌరవించడం తెలుసుకోవాలని విశ్వేశ్వరెడ్డి హితవు పలికారు. గౌరవం అంటే కేవలం ఇచ్చేది కాదని ఇచ్చి పుచ్చుకునేదని చంద్రబాబు తెలుసుకోవాలి. గతంలోనూ తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు.. ప్రస్తుతం మూడున్నరేళ్లు అధికారంలో ఉన్నారు. అయినా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను చూస్తే ఎందుకు భయపెడున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను, ఎన్నికైన సర్పంచ్‌, ఎంపీటీసీలను వదిలేసి కేవలం టీడీపీ నేతలు, కార్యకర్తలకు పనులు అప్పగిస్తూ దళారీ వ్యవస్థను నడిపిస్తారు.

చంద్రబాబుకు రాష్ట్ర చరిత్ర తెలుసునా.. టంగుటూరి ప్రకాశం పంతులు, తరిమెల్ల నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి లాంటి మహామహులు పుట్టినగడ్డ ఆంధ్రప్రదేశ్ కాగా.. ఇక్కడే పుట్టిన చంద్రబాబు మాత్రం ఎంతో నీచంగా వ్యవహరిస్తున్నారు. అనుభవం ఉందని చెప్పుకోవడం కాదు ప్రజల కష్టాలను తీర్చడమే అసలైన అనుభవం. చంద్రబాబు మోసాలను గుర్తించిన జిల్లా వాసులు వైఎస్ జగన్ పాదయాత్రకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విశ్వసనీయత కలిగి ఉన్న నేత వైఎస్ జగన్‌ను గెలిపిస్తే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని’ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top