మరో 20 ఏళ్లు జగనే సీఎం

Minister Dharmana Krishna Das Said Chief Minister YS Jaganmohan Reddy Looks For A Corruption Free Regime - Sakshi

చరిత్రలో చూడని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు

సీఎం బాటలో నిజాయితీగా ఉంటా

లోపాలుంటే సరిచేసుకుంటా

వలంటీర్ల వ్యవస్థతో ప్రగతి పరుగులు

జిల్లాలో వేలాది మందికి ఉద్యోగ కల్పన

ప్రజలకు ఏం కావాలో అవి జగన్‌ చేస్తున్నారు. అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తున్నారు. అభివృద్ధి వైపుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రులంతా ఆయన బాటలో సాగుతున్నారు. అందరికీ అన్నీ చేస్తున్న సీఎంగా జగన్‌ ప్రజల హృదయాల్లో నిలిచిపోతున్నారు. యువకుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దూకుడు చూస్తుంటే మరో 20ఏళ్లు ఆయనే సీఎంగా ఉంటారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రతిపక్షం టీడీపీ అడ్రస్సు గల్లంతు అవుతోంది. ఆ పార్టీ పరిస్థితేంటో ఇప్పుడంతా చూస్తున్నాం. ఆ పార్టీ పని అయిపోయినట్టే.  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలో కనిపిస్తోంది. స్పందించే గుణం ఉంటే ఏదైనా చేయగలమని మన యువ సీఎం నిరూపిస్తున్నారు. మానవతా దృక్పథంతో ముందుకెళ్తున్న వ్యక్తి ఆయన. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకే సెషన్‌లో 19 బిల్లులు ప్రవేశపెట్టి, ఆ మోదించడమంటే అంత సులువు కాదు. విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని, అహర్నిశలు కష్టపడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులందరికీ ఆదర్శంగా నిలిచారు. ఏ ముఖ్య మంత్రీ చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో 20 ఏళ్లు సీఎంగానే కొనసాగుతారు’ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌  ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర 15వ శాసనసభ రెండో సెషన్‌ సమావేశాలు ముగించుకుని జిల్లాకొచ్చిన మంత్రి కృష్ణదాస్‌ గురువారం ‘సాక్షి’ తో కాసే పు మాట్లాడారు. ఆ వివరాలివి.

నిజాయితీగా ఉంటాం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి రహిత పాలన కోసం పరితపిస్తున్నారు. నిజాయితీగా పనిచేయాలని అందరికీ సూచిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులు నిజాయితీగా ఉన్నప్పుడే అవినీతి రహిత పాలన సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడుతున్నా రు. నేను కూడా నిజాయితీగా పనిచేస్తాను. ఎక్కడా ఎలాంటి అవినీతికి అవకాశమివ్వను, నేనే కాకుండా మా నాయకులు కూడా అవినీతికి దూరంగా ఉంటారు. ఎక్కడైనా అవినీతి జరిగితే వేలెత్తి చూపించవచ్చు. పాలనా పరంగా లోపాలుంటే సరిచేసుకుంటాం.   

సీఎం మానవతావాది
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలో మానవతా దృక్పథం ఎక్కువ. అవతలి వ్యక్తులు ఆపదలో ఉన్నా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఆదుకుంటారు. ఆ కోణంలోనే పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేల జీతం ప్రకటించారు. గ్రామాల్లో నిజాయితీగా సేవలందిస్తున్న ఆశ కార్యకర్తలను ప్రోత్సహించేందుకు ఊహించని విధంగా జీతాన్ని రూ. 10వేలకు పెంచారు.  

సంక్షేమంలో దూకుడు 
వైఎస్‌ కుటుంబానికి ప్రజలకు సాయపడే గుణం ఉంది. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను పుణికిపుచ్చుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి కంటే రెండింతలు ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించారు. మరికొన్ని ప్రకటించే పనిలో నిమగ్నమయ్యారు.
 
పేదల కన్నీళ్లు తుడిచే బిల్లులవి
ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఒకే అసెంబ్లీ సెషన్‌లో 19 బిల్లులు ప్రవేశపెట్టారు. వాటికి ఆమోదం పొందా రు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిపుష్టి కల్పిస్తూ చరిత్ర సృష్టించారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించే బిల్లులను ప్రవేశపెట్టారు. మహిళలను రాజకీయ, ఆర్థిక అందలమెక్కించే విధంగా బిల్లులు రూపొందించారు. భూ యజమానులకు నష్టం లేకుండా, వారి హక్కులకు భంగం కలగకుండా,  వారికి రక్షణ కల్పిస్తూ సాగు రైతులకు(కౌలు రైతులకు) మేలు చేసేలా  విధంగా బిల్లు పెట్టారు. ఈ బిల్లు నాకెంతో ఇష్టమైనది. ఎక్కడా లేని విధంగా బిల్లు పెట్టి కౌలు రైతులను ఆదుకుంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం వ్యవసాయ ఉత్పత్తులు, పశు సంపద మార్కెట్ల సవరణ బిల్లు, స్థానిక యువతకు ఉపాధే లక్ష్యంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాల బిల్లు, నామినేటేడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్, నామినేటేడ్‌ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 50 శాతం కేటాయింపులు, శాశ్వత బీసీ కమిషన్, మద్య నియంత్రణ చట్టానికి సవరణ, పాఠశాలల విద్య నియంత్ర, పర్యవేక్షణ కమిషన్, ఉన్నత విద్య కమిషన్, ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ఇలా అనేక బిల్లులు పెట్టి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజామోదం పొందారు. ఈ బిల్లులన్నీ పేదల కన్నీళ్లు తుడవనున్నాయి.

జిల్లాలో ఇకపై ప్రగతి పరుగులు 
జిల్లా ప్రగతి పథంలో పయనించబోతున్నది. అన్ని రంగాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ జిల్లాపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్దానాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యా«ధిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రోగులకు రూ.10వేల పెన్షన్‌ అందజేస్తున్న సీఎం కిడ్నీ వ్యాధిపై యుద్ధం చేసేందుకు పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేశారు. త్వరలో ప్రారంభం కానుంది. జిల్లాలో సంక్షే మ, అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరువ చేసేం దుకు వాలంటీర్ల వ్యవస్థ అమల్లోకి వస్తున్నది. ప్రజల చెంతకే పథకాలు వెళ్తాయి. గ్రామ పరిపాలన గాడిలో పెట్టేందుకు, గ్రామంలోనే అన్నీ సేవలు పొందేందుకు గ్రామ సచివాలయాలు వస్తున్నాయి. దీనివల్ల జిల్లాలో వేలాది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందనున్నారు. మున్ముందు అన్నీ మంచి రోజులే.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top