ఐటీ పుట్టలో గుట్టు? | Income Tax Raids In TDP Leader Putta Sudhar Yadav | Sakshi
Sakshi News home page

ఐటీ పుట్టలో గుట్టు?

Apr 4 2019 11:01 AM | Updated on Apr 4 2019 11:01 AM

Income Tax Raids In TDP Leader Putta Sudhar Yadav - Sakshi

పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఇంటి వద్ద మంత్రి ఆది, ఎంపీ రమేశ్, టీడీపీ నాయకులు

సాక్షి, కడప: టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంటిపై ఆదాయ పన్నుల శాఖ దాడులు వ్యూహాత్మకమేనా? నిజంగా చేపట్టారా.. అధికారుల, ఇటు టీడీపీ నాయకుల చర్యలు అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. ఐటీ అధికారుల తీరు, టీడీపీ నేతల రాద్ధాంతం పరి శీలిస్తే ఏదో మతలబు దాగి ఉందని స్పష్టమవుతోంది. పటిష్ట బందోబస్తు లేకుండా దాడులకు వెళ్లడం, విధులకు ఆటంకం కల్గించినా, అధి కారులు అక్కడి నుంచి జారుకోవడం...పైగా టీడీపీ నేతలు రాజకీయ ప్రసంగాలు చేయడం ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ప్రొద్దుటూరులో ఉంటున్న సుధాకర్‌ యాదవ్‌ ఇంటికి సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఇన్‌కం ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ మహాదేవ్, ప్రొద్దుటూరు ఐటీ  అధికారులు లక్ష్మణరావు, రామలక్ష్మణ్‌ మరో అయిదుగురు కలిసి తనిఖీలకు వెళ్లారు. తనిఖీలకు సాధారణంగా పోలీసు ప్రొటెక్షన్‌ తీసుకుని వెళ్లడం సహజం. కానీ ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే వెంటబెట్టుకొని  వెళ్లారు.

సుధాకర్‌ యాదవ్‌ ఇంట్లో లేకపోవడంతో కుమారుడితో ఐటీ అధికారులు మాట్లాడారు. అరగంటలోపు టీడీపీ నేతలు రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ముక్తియార్, ఈవీ సుధాకర్‌రెడ్డి లాంటి నాయకులంతా చేరుకున్నారు. మిమ్మల్ని ఎవరు పంపించారు. నరేంద్రమోదీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిసికట్టుగా పథక రచన చేశారంటూ కేకలు వేయసాగారు. సుధాకర్‌ ఇంట్లో సోదా చేయమని ఎవరు చెప్పారో తేల్చాలని గట్టిగా నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే  తనిఖీకి వచ్చామని అధికారులు  చెప్పుకొచ్చినా టీడీపీ నేతలు వినిపించుకోలేదు. అధికారుల బ్రీఫ్‌కేసులు తనిఖీలు చేస్తూ ఎంపీ రమేష్‌నాయుడు హంగామా చేశారు. దాంతో ఐటీ అధికారులు వెనుతిరిగారు.

ఇదంతా ఓ నాటకాన్ని తలపించేలా ఉంది. ఇద్దరు పోలీసులను వెంటబెట్టుకొని సోదాలకు రావడం ఏమిటి? వచ్చిన వారు టీడీపీ నేతలు అడ్డగిస్తే వెనుక్కు వెళ్లడం ఏమిటీ? సెర్చి వారెంటు లేకుండా ఎందుకు వెళ్లారు. వారెంటు ఉంటే ఎందుకు తనిఖీలు పూర్తి చేయలేదు. పైగా విధులకు ఆటంకం కల్గించిన టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు? ఇవన్నీ కూడా అనుమానాలు రేకిత్తిస్తున్న అంశాలే.  ముందే ఇంటివద్ద టీడీపీ నేతలు అందుకున్న పల్లవినే సుధాకర్‌ యాదవ్‌ కూడా వినిపించడం విశేషం. తన గెలుపును అడ్డుకునే చర్యల్లో భాగంగా సోదాలు చేయించారనడం మరింత అనుమానాలకు తావిస్తోంది. 

సానుభూతే అసలు లక్ష్యమా....?
మైదుకూరు నియోజకవర్గంలో ఇటీవల మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి తన అనుచరులతో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ మంత్రి రవీంద్రారెడ్డి ఇద్దరు కలిసికట్టుగా ఎన్నికల్లో పనిచేస్తే అక్కడ మరే అభ్యర్థి అయినా నామమాత్రపు పోటీయేనని రాజకీయ విశ్లేషకుల భావన. ఈ తరుణంలో ఐటీ సోదాలమైండ్‌గేమ్‌ను టీడీపీ పెద్దలు రచించారా? సానుభూతి కోసమే వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేశారా? ఈ గేమ్‌లో ఐటీ అధికారులు భాగస్వాములు అయ్యారా? లాంటి అనుమానాలను పరిశీలకులు  వ్యక్తం చేస్తున్నారు. విధులకు ఆటంకం కల్గిస్తే టీడీపీ నాయకులపై అధికారుులు ఎందుకు కేసులు పెట్టలేదు. ఇద్దరు పోలీసులను పంపడం వెనుక ఉన్న మతలబు ఏమిటీ? ఇదంతా కూడా స్థానికంగా ఉన్న అధికారులతో కలిసి టీడీపీ నేతలు పన్నిన ప్రణాలికగా పలువురు చర్చించుకోవడం విశేషం.       
             

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement