బాలకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధం.. ఉద్రిక్తత
సాక్షి, నెల్లూరు : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అత్యున్నత పదవిలో ఉన్న మోదీని కించపరిచిన బాలకృష్ణను వెంటనే అరెస్టు చేయాలంటూ ఏపీ అంతటా బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఒకవైపు బీజేపీ శ్రేణులు బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా.. అందుకు ప్రతిగా టీడీపీ కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.
అనంతపురంలో..
ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేతలు, శ్రేణులు అనంతపురం బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు తెలుగు తమ్ముళ్లు కూడా అక్కడికి చేరుకొని బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంత ఉద్రికత్త పరిస్థితి ఏర్పడటంతో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
బాలకృష్ణను వెంటనే అరెస్టు చేయాలి..
విజయవాడ: నగరంలో బీజేపీ కార్యకర్తలు బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే, సీఎం బావమరిది బాలకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశాయి.