నా కళ్లు తెరిపించాడు: అఖిలేశ్ | Akhilesh Yadav Says That Raja Bhaiya May Not With Us  | Sakshi
Sakshi News home page

నా కళ్లు తెరిపించాడు: అఖిలేశ్

Apr 1 2018 10:40 AM | Updated on Apr 1 2018 1:15 PM

Akhilesh Yadav Says That Raja Bhaiya May Not With Us  - Sakshi

యూపీ మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్

సాక్షి, లక్నో: ఇటీవల గోరఖ్‌పూర్‌, ఫూల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీఎస్పీ సహకారంతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అనంతరం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ సహకారం అందించినా బీఎస్పీ అభ్యర్థి మాత్రం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. బీఎస్పీ ఓటమి కంటే కూడా తమకు మద్దతిస్తున్న నేతల చర్యలతోనే ఎక్కువ నష్టం జరగిందని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. తన కళ్లు ఇప్పటికైనా తెరుచుకున్నాయని కొన్ని విషయాలు ప్రస్తావించారు.

తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని మాజీ సీఎం మాయావతిపై తీవ్ర విమర్శలు చేసిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా ఇకపై ఎస్పీ మద్దతుదారుడిగా కొనసాగరని అఖిలేశ్ అన్నారు. తన ఓటు కచ్చింగా ఎస్పీకే చెందుతుందని రాజా భయ్యా చెప్పగా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసిన అఖిలేశ్ అనంతరం ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. మాకు సహకరించే వ్యక్తి అని నమ్మినప్పుడు ట్వీట్ చేశాను.. కానీ మా నమ్మకాన్ని వమ్ము చేయడంతో పోస్ట్ తొలగించానని అఖిలేశ్ తెలిపారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలతో రాజా భయ్యా తన కళ్లు తెరిపించాడని, ఆయనను నమ్మవద్దని మాయావతి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా అఖిలేశ్ గుర్తుచేశారు. బీజేపీ ఇచ్చిన విందు పార్టీకి రాజా భయ్యా హాజరుకావడం కూడా అఖిలేశ్, మాయావతిలకు మింగుడు పడటం లేదు.

తొలుత లోక్‌సభ ఉప ఎన్నికల వరకే బీఎస్పీ-ఎస్పీ పొత్తు కొనసాగుతుందని చెప్పిన మాయావతి రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాట్లాడుతూ.. మా మైత్రి ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు గోరఖ్‌పూర్‌, ఫూల్‌పుర్‌ ఉప ఎన్నికల ఫలితాలు తమ కూటమికి, పార్టీ కార్యకర్తలకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయని, రాబోయే ఎన్నికల్లో కూడా తమ కూటమికే మొగ్గు చూపుతున్నట్లు అఖిలేశ్ సైతం ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement