17వ లోక్‌సభ ప్రత్యేకతలు ఇవే! | 17 Lok sabha Key Facts | Sakshi
Sakshi News home page

అన్నింట్లోను మేటీ 17వ లోక్‌సభ

May 25 2019 4:53 PM | Updated on May 25 2019 7:57 PM

17 Lok sabha Key Facts - Sakshi

సభ్యుల విద్యార్హతలు ఎక్కువ. వయస్సు తక్కువ. మహిళల ప్రాతినిథ్యం ఎక్కువే..

సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో కొలువు తీరనున్న 17వ లోక్‌సభకు సంబంధించి అనేక విశేషాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే సభ్యుల విద్యార్హతలు ఎక్కువ. వయస్సు తక్కువ. మహిళల ప్రాతినిథ్యం ఎక్కువే. కొత్త ముఖాలు ఎక్కువే. 17వ లోక్‌సభకు 300 మంది మొట్టమొదటి సారి ఎన్నికకాగా, 197 మంది రెండోసారి ఎన్నికయినవారు. 45 మంది రెండుసార్లకన్నా ఎక్కువ సార్లు ఎన్నికైనవారు 17వ లోక్‌సభలో కొలువుతీరుతున్నారు. వారిలో 397 మంది జాతీయ పార్టీల నుంచి, అంటే బీజేపీ నుంచి 303, కాంగ్రెస్‌ నుంచి 52, టీఎంసీ నుంచి 22 మంది ఎన్నికయ్యారు. ఇక ప్రాంతీయ పార్టీలైన డీఎంకే నుంచి 23, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి 22 మంది ఎన్నికయ్యారు. గతంతో పోలిస్తే 25 నుంచి 40 ఏళ్ల లోపు యువకులు ఎక్కువ మంది ఉండగా, 70 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్కులైన వద్ధుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 17వ లోక్‌సభ సభ్యుడి సరాసరి సగటు వయస్సు 54 ఏళ్లు. 40 ఏళ్ల లోపువారు సభలో 12 శాతం ఉన్నారు. గత సభలో వారి సంఖ్య 8 శాతమే. మగవాళ్లతో పోలిస్తే ఆడవారి సరాసరి సగటు వయస్సు ఆరేళ్లు తక్కువ. 

మొత్తం ఎన్నికలైన 542 ఎంపీల్లో 394 మంది ఎంపీలు విద్యార్హతల్లో డిగ్రీ పూర్తి చేశారు. 12వ తరగతి వరకు పూర్తి చేసిన వారు 27 శాతం కాగా, 16వ లోక్‌సభలో వారి శాతం 20గా ఉండింది. పోస్ట్‌ గ్రాడ్యువేషన్‌ పూర్తి చేసిన వారు దాదాపు 25 శాతం కాగా, డాక్టరేట్‌ పూర్తి చేసిన వారు ఐదు శాతం మంది ఉన్నారు. 1996 నాటి నుంచి చూస్తే ప్రతి లోక్‌సభలోను దాదాపు 75 శాతం మంది డిగ్రీ పూర్తి చేసిన వారే ఉంటున్నారు. మహిళా ప్రాతినిధ్యం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. మొదటి లోక్‌సభలో వారి ప్రాతినిధ్యం కేవలం ఐదు శాతం కాగా, 17వ లోక్‌సభలో 14 శాతం. ఈసారి 716 మంది మహిళలు పోటీ చేయగా 78 మంది విజయం సాధించారు. మొత్తం సభ్యుల్లో 39 శాతం మంది సభ్యులు తమ వృత్తిని రాజకీయం, సామాజిక సేవా అని తెలపగా, 38 శాతం మంది వ్యవసాయమని, 23 శాతం మంది వ్యాపారమని, 4 శాతం మంది లాయర్లని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement