
అందరాని అంబరానే నల్లధనం
దేశీయ నల్లధనంపైకి దృష్టిని మరల్చేట్టయితే, ముందుగా చూడాల్సింది గుజరాత్ ఆర్థిక వ్యవస్థను, అక్కడి ప్రభుత్వం పనితీరునే.
విదేశాల్లోని నల్లధనాన్ని తిరిగి రాబట్టి, ఒక్కొక్కరికీ లక్షలకు లక్షల రూపాయలు పంచడమనే ఎన్నికల వాగ్దానం నుండి ప్రభుత్వం మెల్లగా దూరంగా జరుగుతుందనేది స్పష్టమవుతూనే ఉంది. ఆదాయపు పన్ను శాఖ ‘‘దేశంలోని నల్లధనం ఎంత భారీ ప్రమాణంలో ఉన్నదో గ్రహించి దానిపై నుండి దృష్టిని మరల్చరాద’’ని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఇప్పుడు అంటున్నారు. సమస్యను ఈ దృష్టి నుండి చూడటమే సరైనదని నా అభిప్రాయం. విదేశాల్లోని నల్లధనం ఖాతాదార్ల పేర్లలో అత్యధికం గుజరాతీలవే.
దేశీయ నల్లధనంపైకి దృష్టిని మరల్చేట్టయితే, ముందుగా చూడాల్సింది గుజరాత్ ఆర్థిక వ్యవస్థను, అక్కడి ప్రభుత్వం పనితీరునే. నల్లధనం ఆరోపణలను బాధ్యతారహితంగా ప్రచారంచేస్తూ, ప్రజల్లో ఆగ్రహాన్ని రగిల్చిన టెలివిజన్ చానల్స్ ఈ అంశంపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ పట్ల అసంతృప్తితో ఉన్నాయి. ఆయన అమలు చేయలేని వాగ్దానాన్ని చేశారని వాటికి స్పష్టమయ్యేసరికి అవి ఆయనపైకే ఎదురు తిరుగుతాయని నా అంచనా.
భారతీయులు విదేశాల్లో దాచిన నల్లధనం ఎంత? నిజానికి ఎవరికీ నిజం తెలియదు. 8,000 కోట్ల డాలర్లని 2011 నాటి ఓ అంచనా. అది చాలా ఎక్కువని నాటి ప్రధాని మన్మోహన్సింగ్ దాన్ని ప్రశ్నించారు. భారత వాణిజ్య మండలి అసోచామ్ అంచనా ప్రకా రం నల్లధనం మొత్తం 2 లక్షల కోట్ల డాలర్లు. అంటే దేశ స్థూల జాతీయోత్పత్తికంటే ఎక్కువ. సుప్రసిద్ధ కాలమిస్టు స్వామినాథన్ అయ్యర్ నల్లధనం మరీ ఎక్కువగా ఏమీ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. భారత బ్యాంకులతో పోలిస్తే స్విట్జర్లాండ్ బ్యాంకుల వడ్డీ రేట్లు చాలా తక్కువ. కాబట్టి అక్కడి బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం ఆర్థికంగా ఏమంత తెలివైన పని కాదని, పెద్ద ఎత్తున అలాగేమీ జరిగి ఉండకపోవచ్చని ఆయన వాదన.
నల్లధనం అంటే ఏది?
అసలు నల్లధనం అంటే కచ్చితంగా ఏమిటి? ఈ ప్రాథమిక అవగాహన విషయంలోనే చాలా గందరగోళం ఉంది. ఆదాయపు పన్ను ఎగవేసిన డబ్బంతా నల్లధనం. ఈ నిర్వచనం ప్రకారం మన దేశ వయోజన జనాభాలో చాలా పెద్ద భాగం వద్ద, బహుశా మెజారిటీ వద్ద నల్ల ధనం ఉంటుంది. సోనియా గాంధీ కుటుంబం భారీ ఎత్తున ముడుపు లు పుచ్చుకుని కూడబెట్టిన సొత్తునంతా విదేశాలకు తరలించిందని భారతీయ జనతా పార్టీ ఆరోపణలు గుప్పించింది. ఆ డబ్బును తిరిగి వెనక్కు రప్పిస్తామని వాగ్దానం చేసింది. కాబట్టి లంచాలు పుచ్చుకొని కూడబెట్టి, విదేశాల్లో దాచిన డబ్బే ‘‘నల్లధనం’’ అని చాలా మంది విశ్వసిస్తున్నారు.
అతిశయోక్తులతో కూడిన రాజకీయ ఆరోపణలు, ఊహాత్మక అంచనాలు, బాధ్యతారహితమైన మీడియా కలసి ఇలా భారత ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దాన్ని బీజేపీ సొమ్ము చేసుకుంది. ముందుగా అద్వానీ, ఆ మీదట నరేంద్ర మోదీ ఆ అస్త్రాన్ని అందుకున్నారు. బీజేపీ దృష్టిలో నల్లధనమంటే అవినీతితో ముడిపడి ఉన్న అంశం. ప్రభుత్వం మారితే చాలు, పరిష్కారం చేసేయగలి గినంతటి సులువైన సమస్య.
ప్రచార దుమారంలో గల్లంతైన వాస్తవాలు
మోదీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక సభలో ఇలా అన్నారు: ‘‘ఈ గజ దొంగలు విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బునంతా వెనక్కు తీసుకొస్తే, ప్రతి పేద భారతీయునికి 15 నుంచి 20 లక్షల రూపాయలు వస్తా యి. అంత డబ్బు మూలుగుతోందక్కడ. మన పార్లమెంటు సభ్యుడు రైల్వే లైను గురించి మాట్లాడారు. ఈ నల్లధనాన్ని వెనక్కు తీసుకొస్తే, మనకెక్కడకు కావాలంటే అక్కడికి రైల్వే లైన్లను నిర్మించుకోవచ్చు. ఈ దేశాన్ని లూటీ చేయడాన్ని వాళ్లు అనుమతించారు. ఇప్పుడు వాళ్లు సిగ్గు విడిచి ‘‘ఆ డబ్బును ఎలా వెనక్కు తీసుకురాగలం?’’ అని ప్రశ్నిస్తున్నారు.
ఇన్నాళ్లూ ప్రభుత్వాన్ని నడిపింది వాళ్లు, సమాధానాలు చెప్పాల్సింది మోదీ! బీజేపీకి అవకాశం దొరికిన రోజున, అందులోని ప్రతి పైసాను వెనక్కు తెస్తుంది, పేద భారతీయుల కోసం ఉపయోగిస్తుంది.’’ ఈ మోదీ ప్రసంగాన్ని జనవరి 9న యూట్యూబ్లో ఉంచారు కూడా. నల్లధనం గురించి మోదీ అంచనాలను, దాన్ని ఆయన వెనక్కు తీసుకురాగలగడాన్ని కూడా మీడియా సవాలు చేసి ఉండాల్సింది. కానీ ఎన్నికల ప్రచారపు మాయాజాలంలో వాస్తవాలు కొట్టుకు పోయాయి.
అవకాశం ఇచ్చినా నత్తనడకేనా?
మోదీ కోరినట్టుగానే బీజేపీకి ఆ అవకాశం లభించింది. కానీ నాటకీయమైన ఆ మార్పును మాత్రం అది తేలేకపోయింది. ప్రధానమంత్రిగా మోదీ మొట్టమొదటి రోజున నల్లధనం వేట కోసం ప్రత్యక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించారు. కానీ ఆ తర్వాత ఆ సమస్య తిరిగి పాత బాటలోకే జారిపోయినట్టుంది. బీజేపీకి చెందిన సుబ్రహ్మణ్యం స్వామి, రామ్జెఠల్మానీల వంటి వారు సహా (వారిద్దరిలో ఎవరినీ సమతూకం కలిగిన వ్యక్తులని చెప్పుకోలేం) ఆ పార్టీలో అందరిదీ అదే వైఖరి.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే విదేశాల్లో బ్యాంకు ఖాతాలున్న భారతీయులందరి జాబితా అందింది. సిట్ దాన్ని పట్టుకునే దర్యాప్తు చేస్తోంది. ఆ జాబితాలో కొన్ని వందల మంది ఉన్నారు. అందులో సగం మంది చట్టబద్ధంగానే ఖాతాలున్నవారని (ప్రవాస భారతీయు లు) భావిస్తున్నారు. చట్టవిరుద్ధంగా విదేశీ బ్యాంకు ఖాతాలను కలిగిన 18 మంది పేర్లను ఈ ఏడాది ఏప్రిల్లోనే ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ సమస్యపై చురుగ్గా వ్యవహరిస్తున్న సుప్రీం కోర్టు వత్తిడి వల్ల ముగ్గురు చట్టవిరుద్ధ విదేశీ ఖాతాదార్లపై చర్యలు తీసుకున్నట్టు పేర్కొంటూ ఇప్పుడు మరో మూడు పేర్లను బహిరంగపరచారు. అయితే ఆ ముగ్గురూ ఆ ఆరోపణలతో విభేదించారు. ప్రత్యేకించి వారిలో ఏ ఒక్కరూ మరీ అంత పెద్ద సంపన్నవంతులేం కారు. ఇంతకూ వారు విదేశాల్లో దాచింది ఎంత మొత్తమో, అందులో ఎంత తిరిగి రాబడతారో చెప్పనే లేదు.
నీరుగారిపోతున్న మోదీ వాగ్దానం
నల్లధనాన్ని తిరిగి రాబట్టి, ఒకొక్కక్కరికీ లక్షలకు లక్షలు పంచడమనే తమ మునుపటి వాగ్దానం నుండి ప్రభుత్వం మెల్లగా దూరంగా జరుగుతుందనేది స్పష్టమౌతూనే ఉంది. ఇక దృష్టిని కేంద్రీకరించాల్సింది. దేశంలోనే ఉన్న నల్లధనంపైనేననీ, ఆదాయపు పన్ను శాఖ ‘‘దేశంలోని నల్లధనం ఎంత భారీ ప్రమాణంలో ఉన్నదో గ్రహించి దానిపై నుంచి దృష్టిని మరల్చరాద’’ని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఇప్పుడు అంటున్నారు. ‘‘దేశంలో నల్లధనం ఎక్కువగా ఉన్న శాఖలను వేటాడటానికి శాయశక్తులా కృషి చేయాల’’ని ఆయన ఆదాయపు పన్ను శాఖలోని సీనియర్ అధికారులను కోరారని ఒక నివేదిక తెలిపింది. నల్లధనం సమస్యను ఈ దృష్టి నుండి చూడటమే సరైనదని నా అభిప్రాయం.
నల్లధనం ఖాతాదార్ల పేర్లలో అత్యధికం (మొదటి 18 మంది జాబితాలో 15 మంది, తర్వాతి ముగ్గురి జాబితాలో ఒకరు) గుజరాతీలవే. దేశీయ నల్లధనంపైకి దృష్టిని మరల్చేట్టయితే, ముందుగా చూడాల్సింది గుజరాత్ ఆర్థిక వ్యవస్థను, అక్కడి ప్రభుత్వం పనితీరునే. నల్లధనం ఆరోపణలను బాధ్యతారహితంగా ప్రచారం చేస్తూ, ప్రజల్లో ఆగ్రహాన్ని రగిల్చిన టెలివిజన్ చానల్స్ ఈ అంశంపై ఇప్పటికే ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నాయి. ఆయన అమలు చేయలేని వాగ్దానాన్ని చేశారని వాటికి స్పష్టమయ్యేసరికి అవి ఆయనపైకే ఎదురు తిరుగుతాయని నా అంచనా.
(వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)