పీత కష్టాలు పీతవి | teugu capital amaravathi | Sakshi
Sakshi News home page

పీత కష్టాలు పీతవి

Oct 29 2015 8:33 AM | Updated on May 25 2018 7:04 PM

పీత కష్టాలు పీతవి - Sakshi

పీత కష్టాలు పీతవి

అమరావతి అంటే నామట్టుకు మొన్నమొన్నటి వరకూ మిత్రుడు శంకరమంచి సత్యం ఊరు.

జీవన కాలమ్:
అమరావతి అంటే నామట్టుకు మొన్నమొన్నటి వరకూ మిత్రుడు శంకరమంచి సత్యం ఊరు. సత్యం అర్చకుల కుటుంబానికి చెందినవాడు. అతని రచనల ద్వారానే అమరే శ్వరుడి క్షేత్రం పరిచయం. సత్యం 'అమరావతి కథలు' రాసే రోజుల్లో ఇద్దరం రేడియోలో ఉద్యోగం చేస్తున్నాం. ఓసారి ఏదో పని మీద మద్రాసు వచ్చి నన్ను కాగితాలు అడిగి నా ముందే కూర్చుని అమరావతి కథ రాశాడు. సత్యం కన్నుమూ శాక ఓ సంవత్సరం సాహిత్య అకాడమీ కథల బహు మతికి నేను న్యాయనిర్ణేతని. ‘అమరావతి కథల’ సరసన మరే కథల పుస్తకం ఉన్నా కొన్ని ఆమడల దూరంలో ఉంటుంది అని రాసిన గుర్తు. ఇవాళ సత్యం ఉంటే రాజ ధాని తన ఊరుకి వచ్చినందుకు గర్వపడేవాడు.


ఒక తరంలో కొత్త రాజధాని నిర్మాణాన్ని చూడటం అపూర్వమైన అనుభూతి. రాజధానిలో ఏమేం ఉండాలో చాలా మంది పెద్దలు గుంజాటన పడడాన్ని మనం వింటున్నాం. ఒక తెలుగు కళాకారుడి కలల గురించి ఈ ప్రభుత్వానికి ఎవరయినా చెప్పారో లేదో. నాకు కనీసం 52 సంవత్సరాలుగా హైదరాబాద్ తెలుసు. నా కళ్ల ముందే రవీంద్రభారతి నిర్మాణం జరిగింది. లెక్కలేనన్ని ప్రదర్శనలు, సభలు, కచ్చేరీలను చూశాను. బడేగులాం ఆలీఖాన్ కచ్చేరీ, టి.ఆర్.మహాలింగం కచ్చేరీ, నా 'మహానటుడు' నాటకాన్ని కె. వెంకటేశ్వరరావు ప్రదర్శన, గోవిందరాజుల సుబ్బారావు వృద్ధాప్యంలో 'కన్యా శుల్కం'ప్రదర్శన, అద్దంకి శ్రీరామమూర్తి దశరథుడి వేషం- కొన్ని మధురమైన జ్ఞాపకాలు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రూపుదిద్దుకోవడం నాకు తెలుసు. అక్కడ రోశయ్యగారి చేతుల మీదుగా నా 'సాయంకాలమైంది' నవలకి సాహిత్య అకాడమీ పుర స్కారాన్ని అందుకోవడం మంచి జ్ఞాపకం. కొత్త తెలుగు రాజధానిలో రవీంద్రభారతి వంటి నాలుగయిదు థియేటర్ల కాంప్లెక్స్ అవసరం. ప్రతి సాయంకాలం రాజధాని వచ్చే వారికి అది 'కళాకారుల కూడలి'కావాలి.
 ఈ మధ్య అకాడమీల పునరుద్ధరణ జరగాలన్న ఆలోచన వినిపిస్తోంది. ఆ ఆలోచనకి నా వోటు.


ఇప్పుడు హైదరాబాద్‌లో తెలుగు విశ్వవిద్యాలయం ఏమవుతుంది? రెండుసార్లు రాష్ట్రం విడి- చాలా విలువయిన గ్రంథాలు అటు తంజావూరు 'సరస్వతీ గ్రంథాలయం'లో, మద్రాసు విశ్వవిద్యాలయాలలో ఉండి పోయాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉండిపోతాయి. అయితే అదీ తెలుగు రాష్ట్రమే కదా? ఆ సంపద మళ్లీ ఏకీకృతం కావాలి.


తమ తమ కళలకు సంబంధిం చిన పనులకు రాజధాని వచ్చే కళాకా రులకు సబ్సిడీ ధరలతో వసతిని - ఒక భవనాన్ని (దాన్ని 'కళాభవన్' అంటారా?) ఏర్పరచాలి. అలాగే ఆహార సదుపాయాలు కూడా. ఒక ఫ్లోర్‌లో చాట్ల శ్రీరాములు, మరో ఫ్లోర్‌లో బాలమురళీకృష్ణ, ఇంకో ఫ్లోర్‌లో రాధారెడ్డి, రాజారెడ్డి, మరొక ఫ్లోర్‌లో కాళీ పట్నం రామారావుగారు విడిదిచేసి ఉంటే ఎంత హృద్యంగా ఉంటుంది? తెలుగుదనం ఎంత పరి పుష్టంగా దర్శనమిస్తుంది!

తెలుగుదేశంలో దాదాపు ప్రతీ రచయితా తన రచనల్ని తానే ప్రచురించుకోవాల్సిన దురదృష్టకరమైన పరిస్థితి. సాధకబాధకాలు అలా ఉండగా పంపిణీ పెద్ద సమస్య. ప్రభుత్వం కనీస బాధ్యత - ఒక కోపరేటివ్ అయినా ప్రారంభించి ప్రచురణ, పంపిణీకి ఆదుకో వాలి. అంతకన్నా ముఖ్యమయిన సౌకర్యం తెలుగు దేశంలో ఎక్కడ పుస్తకం ప్రచురితమయినా - అమ్మ కానికి ఒక స్టాల్ అవసరం. కొత్త పుస్తకం అమ్మకానికీ, సమాచారానికీ అక్కడ చేరాలి. ఈ సంవత్సరం తెలుగు విశ్వవిద్యాలయం కపిలవాయి లింగమూర్తి అనే 90 ఏళ్ల వృద్ధునికి డాక్టరేటు ఇచ్చింది. ఆయన చాలా చక్కని పుస్త కాలు రాశారు. వాటిని వారి కొడుకులు, మనుమలు ప్రచురిస్తారు. ఎప్పుడూ ఆ పుస్తకాల్ని నాకు పంపుతారు. ‘అయ్యో. చాలా మంది చేతికి ఈ పుస్తకాలు వెళ్తే బాగుం టుంది’ అని నాకనిపిస్తుంది. అలాగే చాలా మంది ప్రచు రించుకున్న రచనలు. వాటి అమ్మకానికి ప్రభుత్వ సహ కారం కావాలి. ఈ కాంప్లెక్స్‌లోనే పుస్తక విక్రయశాల - సమగ్రంగా ఏర్పడాలి. ఆ రోజుల్లో కాశీనాథుని నాగేశ్వర రావు, పండిత డి.గోపాలాచార్యుల వంటి వదాన్యులు పుస్తక ప్రచురణకి చేయూతనిచ్చేవారని శ్రీపాద సుబ్ర హ్మణ్యశాస్త్రిగారు తమ ‘అనుభ వాలూ- జ్ఞాపకాలూను’లో పేర్కొ న్నారు. ఇది ప్రభుత్వం చెయ్యాలి. ఆర్థికపరంగా ఇది ప్రభుత్వానికి పెద్ద బరువు కాదు. కాని రచయితకి కొండంత ఉపకారం. అలాగే చక్కని ప్రదర్శనలిచ్చే నాటక సంస్థలకి రాయితీలు కల్పించి ప్రతిరోజూ ఏదో ఒక ప్రదర్శన ఈ కేంద్రంలో ఉండే ఏర్పాటు కష్టం కాదు. ఏతావాతా రాజధానిలో కళాకారుడికి తనదైన అడ్రసు ఏర్పడాలి. ఫలానా నటుడి వివరం, రచయిత రచన, సంస్థ చిరునామా - పిలిస్తే పలకాలి. రాజధాని తెలుగు కళా కేంద్రంలోకి వస్తే మంచి కచ్చేరీ, మంచి నాటకం, మంచి పుస్తకం, మంచి గోష్టి - యిన్నిటికి ఆస్కారం కల్పించాలి. ఇదొక ఆర్ట్ విలేజ్. ఇక్కడ అందరికీ స్థానం ఉండాలి.

రాజధాని నిర్మాణంలో ఈ సూచనలు 'పిడకల వేట'గా కొందరికయినా అనిపించవచ్చునేమో. కాని పీత కష్టాలు పీతవి. కొత్త రాజధానిలో శాసనసభా భవ నాలు, సెక్రటేరియట్‌లూ, సిబ్బంది కాలనీలు, ఆకాశ హర్మ్యాలూ, వాటర్ ఫ్రంటులూ- అన్నీ తెలుస్తున్నాయి. కాని ఎక్కడా కళాభవనం ప్రసక్తిలేదు. నాయకులు పాలన చేస్తారు, శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తారు. కాని తరతరాల జాతి ఆలోచనా సరళికీ, సంస్కృతీ వైభవానికీ అద్దం పట్టేది కళ. ఒక జాతి ప్రత్యేకతనూ, వికాసాన్ని ప్రతిఫలించేది కళ. ‘కళ’ ఉనికిని గర్వంగా చెప్పుకునే అడ్రసు రాజధానిలో ఉండాలి. సర్వాంగసుందరంగా, సర్వజనామోదంగా నిర్మిస్తున్న ఈ చరిత్రాత్మకమయిన కృషిలో- సమగ్రమైన మృష్టాన్న భోజనాన్ని సమకూరు స్తున్న వేళ ఆ విస్తరిలో 'తెలుగు'రుచి ప్రత్యేకంగా కనిపించాలని కోరిక. కళాకారుడికి, రచయితకి ప్రత్యేకమైన ఉపకారం జరగాలని ఆశించడం అనౌచిత్యం కాదు. ఇది తెలుగు కళాకారుడి కల. తెలుగు రాజధానిలో తెలుగు కల.

http://img.sakshi.net/images/cms/2015-03/41426100977_295x200.jpg

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement