సంకల్పంతో సీమకు సాగునీరు సులభమే! | Irrigation water easy to get to rayalaseema only Determined | Sakshi
Sakshi News home page

సంకల్పంతో సీమకు సాగునీరు సులభమే!

Dec 31 2014 1:17 AM | Updated on Sep 2 2017 6:59 PM

సంకల్పంతో సీమకు సాగునీరు సులభమే!

సంకల్పంతో సీమకు సాగునీరు సులభమే!

సీమకు న్యాయం జరగాలంటే గోదావరి జలాలను వీలైనంత మేరకు కృష్ణకు తరలించి, కృష్ణా డెల్టాకు అందించినంత మేర నికర జలాలను తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా వంటి సీమ ప్రాజెక్టులకు తరలించాలి.

సీమకు న్యాయం జరగాలంటే గోదావరి జలాలను వీలైనంత మేరకు కృష్ణకు తరలించి, కృష్ణా డెల్టాకు అందించినంత మేర నికర జలాలను తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా వంటి సీమ ప్రాజెక్టులకు తరలించాలి. త్వరితగతిన గోదావరి-కృష్ణ నీటి మళ్లింపుపై తగు నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే తెలుగునేలపై మరో కొత్త రాష్ట్రం ఏర్పాటుకు రహదారిని ఏర్పరచడమే అవుతుంది.  
 
తెలుగువారందరి ప్రత్యేక రాష్ట్రం విశాలాంధ్ర ఏర్పాటుకు అంగీకరించి రాయలసీమ వాసులు అన్ని విధాలా నష్టపో యారు. సర్కారు జిల్లాలతో ఐక్యత పట్ల నాటి సీమ నేత లలో పలువురికి  ఆంధ్ర మహా సభ కాలం నుండి అనుమానా లు ఉండేవి. ఆంధ్ర విశ్వవిద్యా లయ కేంద్రాన్ని అనంతపురం లో ఏర్పాటు చేయాలంటూ యూనివర్సిటీ సెనేట్ కమిటీ 1926లో చేసిన తీర్మానాన్ని సైతం లెక్కచేయక దాన్ని విజయవాడ నుండి విశాఖపట్టణానికి తరలించారు. ఇలాంటి వైఖరి కారణంగానే తమిళుల ఆధిపత్యం వదు ల్చుకొని సర్కారు జిల్లాల వారి ఆధిపత్యం కొనితెచ్చుకో వడం ఎందుకంటూ, ప్రత్యేక రాయలసీమ డిమాండు ముందుకొచ్చింది. 1934లో రాయలసీమ మహాసభ కూడా ఏర్పడింది.
 
 ఈ నేపథ్యంలో సర్కారు, సీమ పెద్దమ నుషుల మధ్య శ్రీబాగ్ ఒడంబడిక (1937) కుదిరింది. ఆచరణలో అది  రాయలసీమను ఆంధ్ర రాష్ట్రంలో ఐక్యం చేయడానికి వేసిన ఎత్తుగడ మాత్రమేనని రుజువైంది. 1953లో రాయలసీమసహా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరి గింది. కానీ కర్నూలులో రాజధాని, అనంతపురంలో ఆంధ్ర విశ్వవిద్యాలయపు రెండో కేంద్రం ఏర్పాటు వాగ్దా నాలు గాలిలో కలసిపోయాయి. పదేళ్లు, అవసరమైతే ఆ పై మరికొన్నేళ్లపాటు సీమ ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధా న్యం ఇవ్వడం, తుంగభద్ర, పెన్న, కృష్ణాజలాలతో రాయ లసీమ, నెల్లూరు జిల్లాల సాగు భూములను కోస్త్రాంధ్ర జిల్లాల స్థాయికి అభివృద్ధి చేయడం వంటి మాటలన్నీ నీటి మూటలయ్యాయి. ఫలితంగా రతనాల సీమ కరువు కాటకాల సీమగా మారింది. సీమ నీటి అవసరాలను తీర్చగలిగినది కృష్ణా నది నీరేనని సర్ మెకంజీ 1880 ప్రాంతంలోనే  గుర్తించారు. కృష్ణా-తుంగభద్ర-పెన్నా నదుల అనుసంధానంతో 3,60,000 ఎకరాలకు సాగు నీరందించే పథకాన్ని ఆయన రూపొందించారు. అది కలగానే మిగిలిపోయింది.
 
 1947 లో గోదావరిపైన, 1953లో కృష్ణపైన ఆనకట్టలను నిర్మిం చినా సీమకు ఒరిగిందేమీ లేదు. కాటన్ రూపొందించిన కడప-కర్నూలు కాలువ నిర్మాణం (1890) వల్ల కర్నూలు జిల్లాలో 1,84,000, కడప జిల్లాలో 94,000 ఎకరాలకు సాగునీరు మాత్రమే సీమకు దక్కింది. 1951లో నాటి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టును ప్రతిపాదించి, కేంద్ర ప్రభుత్వం, ప్రణాళికా సంఘాల అనుమతులను సైతం పొందింది. ఆ ప్రాజెక్టుతో కర్నూలు జిల్లాలో 2,50,000, కడప జిల్లాలో 4,00,000, చిత్తూరు జిల్లాలో 70,000, నెల్లూరు జిల్లాలో 7,00,000 ఎకరాలకు సాగునీరు లభించేది. సీమకు గొప్ప వరం లాంటి ఆ ప్రాజెక్టు వల్ల సర్కారు జిల్లాలకు నీరు తగ్గిపోతుందన్న స్వార్థంతో అక్కడి నేతలు దానికి కాలడ్డారు. తమిళులు నీటిని తరలించుకుపోతున్నారని గగ్గోలు పెట్టారు. సీమకు మేలు చేయగల ప్రాజెక్టును సీమవాసులే వ్యతిరేకించేట్టు చేశారు. సీమకు చుక్క నీరైనా అందివ్వలేని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం ఉద్యమించేట్టు చేశారు.
 
 ఆ ప్రాజెక్టు కోసం 1954లో ఆంధ్ర, హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా సీమ సాగునీటి పథకాలకు కృష్ణా నికరజలాలే లేకుండాపోయాయి. అదే ఏడాది తుం గభద్ర ప్రాజెక్టు నుండి 80 శాతం విద్యుత్తు, 20 శాతం నీరు ఆంధ్రకు చెందేట్టుగా ఆంధ్ర-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. అలా సీమకు తుంగభద్ర నీటినీ పెద్దగా మిగలకుండా చేశారు. 1976లో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కృష్ణా జలాల (తుంగభద్ర నీరు సహా) వాటాను 800 టీఎంసీలుగా నిర్ణయించింది. 1981 అఖిల పక్ష సమావేశం ఆ నీటిని కోస్తాకు 377.70 (49.2%), తెలంగాణకు 266.83 (34.8%), రాయలసీమకు 122.70 టీఎంసీలు (16.8%) పంపకం చేసింది. ఈ కేటాయింపుల సమయంలో శ్రీబాగ్ ఒడంబడికలోని నీటి ప్రాధాన్యతలు, హామీలుగానీ, గోదావరి నీటిని కృష్ణకు తరలించే నీటి గురించిగానీ, కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టు విషయంగానీ ఎవ రికీ పట్టలేదు. పైగా ఈ కేటాయింపులకు ప్రాతిపదిక పంట భూముల విస్తీర్ణంగానీ, జనాభాగానీ, వెనుకబాటు తనంగానీ  కాకపోవడం విశేషం. ఈ ఒప్పందం ద్వారా సీమకు కొత్తగా చుక్కనీరు దక్కిందిలేదు. సీమకు కేటాయించిన 122.70 టీఎంసీలలో కొత్తగా కేటాయించిన నికరజలాలు శూన్యం. పైపట్టికలోని వివరాలను గమనిస్తే సీమకు జరిగిన అన్యాయం విశదమవుతుంది.  
 
 సీమకు న్యాయం జరగాలంటే గోదావరి నదీ జలా లను వీలైనంత మేరకు కృష్ణకు తరలించి, కృష్ణా డెల్టాకు అందించినంత మేర నికర జలాలను సీమలోని తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా వంటి సీమ ప్రాజెక్టు లకు తరలించాలి. 1962 నాటి గుల్హతి కమిషన్ సూచించి నట్టు నీటి మళ్లింపు చర్యలు చేపట్టాలి. శ్రీబాగ్ హామీలను ఈ రూపంలో ఈ మేరకైనా ఇప్పటికైనా సాకారం చేయ డానికి అన్ని ప్రాంతాల వారు కలిసికట్టుగా కృషి చేయాలి. త్వరితగతిన గోదావరి-కృష్ణా నీటి మళ్లింపుపై తగు నిర్ణ యం తీసుకోవాలి. లేకపోతే తెలుగు నేలపై మరో కొత్త రాష్ట్రం ఏర్పాటుకు రహదారిని ఏర్పరచడమే అవుతుంది.
 (వ్యాసకర్త ఎస్.వి. యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు)
 మొబైల్ నం: 9849584324

 
ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల పంపకం, వాడకం తీరు
అంశం    కోస్తాంధ్ర    తెలంగాణ    రాయలసీమ
1.    ఎ.    ఇప్పటికే ఉన్న, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులు,   
పథకాలతో సాగునీరు అందే భూములు (లక్షల హెక్టార్లలో)    33.8    25.7    8.5
బి.    మొత్తం పంట భూముల్లో సాగునీరు అందే భూమి శాతం    94.0    53.9    28.4
2.    ఎ.    మొత్తం పంట భూములు (లక్షల హెక్టార్లలో)    35.9    47.7    29.8
బి.    పంట భూమి విస్తీర్ణం ప్రాతిపదికన 2,746 టీఎంసీల నదీజలాలలో
మూడు ప్రాంతాలకు అందవలసిన వాటా (టీఎంసీలు)    870.0    1153.0    723.0
సి.    ప్రతీ 1,000 మంది జనాభాకు లభ్యమవుతున్న
 నదీజలాలు (మిలియన్ ఘనపుటడుగులు)    67.0    48.0    25.0
  డి.    పంట భూముల్లో ప్రతి 1,000 ఎకరాలకు ఉపయోగిస్తున్న
నదీ జలాలు (మిలియన్ ఘనపుటడుగులు)    174.0    78.0    34.0
 డా॥దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement