దీక్షాంధ్రప్రదేశ్‌ | ‘AP state is now Diksandhrapradesh’ | Sakshi
Sakshi News home page

దీక్షాంధ్రప్రదేశ్‌

Jun 10 2017 12:52 AM | Updated on Sep 5 2017 1:12 PM

దీక్షాంధ్రప్రదేశ్‌

దీక్షాంధ్రప్రదేశ్‌

ఈ దీక్షలు ఏ ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపడం లేదు.

ఈ దీక్షలు ఏ ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపడం లేదు. అసలీ దీక్ష ఎవరికిస్తున్నారో చెప్పండి. దీక్షా ప్రసంగాలు జనాన్ని డిప్రెషన్‌లోకి నెట్టేసేలా సాగుతున్నాయ్‌.

‘‘ఏమిటండీ ఈ నవ నిర్మాణ దీక్ష– వినలేక కనలేక చచ్చిపోతున్నాం. ఏ చానల్‌ చూసినా ఇదే...’’– నా అసహనాన్ని వ్యక్తం చేశా. ‘‘మీరే అట్లా అనుకుంటే మా సంగతేంటి సార్‌? నేను ఏపీ సర్కార్‌లో గ్రూప్‌ వన్‌ అధికారిని. వారం రోజుల్నుంచీ గూబలు పగిలి పోతున్నాయ్‌. సంసార జీవితానికి పనికి రాకుండా పోతానేమోనని భయంగా ఉంది సార్‌’’ అంటూ బావురుమన్నాడు. ఈ దీక్షలేంటో.. ఈ కఠోర శపథాలేంటో ఎవరికీ అర్థం కావ డం లేదు. కొందరికి మాత్రం, ఇది బాబుగారి భయంలోంచి, ఇన్‌సెక్యూరిటీ లోంచి పుట్టుకొస్తున్న ఆలోచనలని అర్థం అవుతోంది.

ఎన్ని పని గంటలు, ఎంత డబ్బు, ఎంత అధికారం దుర్వినియోగం అవుతుందో చాలామంది లెక్కలు కడుతున్నారు. ఈ దీక్షలు ఏ ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపడం లేదు. అసలీ దీక్ష ఎవరికిస్తున్నారో చెప్పండి. మీ అనుచరగణానికి, మీ సొంత వర్గానికా, అధికార వర్గానికా, మీ పార్టీ కార్యకర్తలకా లేక రాష్ట్ర ప్రజలందరికీనా? దీక్షా ప్రసంగాలు జనాన్ని డిప్రెషన్‌లోకి నెట్టేసేలా సాగుతున్నాయ్‌. విభజనలో అన్యాయం చేశారు. రోడ్డున పడేశారు. అయినా హెర్క్యులిస్‌లా నేనున్నా... భారాన్ని నే మోస్తా.. అంటూ పదే పదే, దపే దపే, చెప్పిందే చెప్పి, మళ్లీ చెప్పి, అందర్నీ దెప్పి... ఇదంతా మహా దిగులు పుట్టిస్తోంది. అన్నదమ్ముల్లా విడిపోయాం. కష్టపడదాం. బాగుపడదాం. ఎవర్నెవరు అన్యాయం చేశారో తెలియదు.
విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అడుగులేని నావ అని తెలిసికూడా ముందుకు నడిపిస్తానని చుక్కాని పట్టుకున్నారు చంద్రబాబు. ఆత్మ విశ్వాస మన్నా కావాలి అది, అధికార దాహమన్నా అయి ఉండాలి. ఆత్మవిశ్వా సమే అయితే, పరనింద ఆత్మస్తుతి వదిలి హీరోలా ప్రవర్తించాలి.

ఓ పౌరాణిక నాటకంలో ఒక పతివ్రత వేషధారిణి దుష్టుడికి శాపం పెట్టబోయేముందు, ఏను పతివ్రతయేని... నేను మహా పతివ్రతయేని అంటూ సవాల్‌ విసిరి శాప పద్యం అందుకున్నది. ఆవిడ చాలెంజి అయీ కాకుండానే ప్రేక్షకుల్లోంచి ఓ సరసుడు ‘‘ఏం డౌటా’’ అని అరిచాడు. దాంతో పతివ్రత పద్యానికి తడబడింది. అందుకే ఎప్పుడూ పాయింట్లోకి వెళ్లిపోవాలి గానీ రోజుల తరబడి వ్యర్థ ప్రసంగాలకు దిగకూడదు. పైగా ఇంకా కోటిన్నరమంది తెలుగువాళ్లు తెలంగాణలో సుఖ జీవనం సాగిస్తున్నారు. ఇంకోటిమంది వేళ్లూ, కాళ్లు ఇక్కడే ఉన్నాయి. అంచేత అనవసరంగా పేలకూడదు.

‘‘నవ నిర్మాణ’’ అనగానే జనానికి సిమెంటు, ఇసుక గుర్తొస్తున్నాయ్‌. ఎవరి కుండే ప్లస్‌లు వాళ్లకున్నాయ్‌. ఏపీకి ఎవరికీ లేనంత సముద్ర తీరం ఉంది. సారవంతమైన నేల ఉంది. శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకన్న, బెజవాడ కనకదుర్గమ్మ ఉన్నారు. రాష్ట్రానికి బంగారు ప్యాకేజీలు ఉదారంగా ఇచ్చే మోదీ ఉన్నారు. వరాలు మోసుకుంటూ తెచ్చిస్తూ ఆసులో గొట్టంలా తిరిగే వెంకయ్య మీ వెనక ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరు జనానికి ఇలా దిగుళ్లు నూరిపొయ్యకండి బాబూ!

   - శ్రీరమణ

  (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement