ఐఏఎఫ్‌సీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రవాస భారతీయోత్సవం

IAFC Hosted Indian American Festival in Dallas - Sakshi

డాలస్ : ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్‌సీ)ఆధ్వర్యంలో ప్రవాస భారతీయోత్సవం ఘనంగా జరిగింది. డాలస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 3000 మందికి పైగా ఎన్‌ఆర్‌ఐలు హాజరయ్యారు. వందలాది మంది పిల్లలు కేరింతలు కొడుతూ ‘పెట్టింగ్ జూ’, ‘పోనీ రైడ్స్’,  ‘స్టిల్ట్ వాకర్స్’, ‘ఫేస్ పెయింటింగ్’, ‘మెహంది’, ‘బౌన్సు హౌస్’ దగ్గర కోలాహలం చేశారు. దాదాపు 500 మందికి పైగా యువతీయువకులు భారత సంగీత సాహిత్య అంశాల ప్రధానంగా భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సి, జానపద నృత్య రీతులలో వారు చేసిన నాట్య విన్యాసాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాశ్చాత్య సంగీత రీతులతో కూడిన కాప్పెల్ పాఠశాల అమెరికన్ విద్యార్థినీవిద్యార్థులు 20 నిమిషాలకు పైగా జరిపిన సంగీత విభావరి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారందరికి టెక్సాస్ రాష్ట్రానికి చెందిన అమెరికా సెనెటర్ టెడ్ క్రూజ్ స్వయంగా యోగితా పత్రాలను అందజేశారు. 

అమెరికా గాట్ టాలెంట్‌లో స్థానం సంపాదించిన, స్పానిష్ గాట్ టాలెంట్‌లో సెమీఫైనలిస్ట్‌గా నిలిచిన హైదరాబాద్‌కు చెందిన యువకుడు క్రాంతి కుమార్ చేసిన చూపుడు వేలుతో కొబ్బరికాయకు రంధ్రం చేసి కొబ్బరి నీళ్ళు త్రాగడం, రక్తస్రావం లేకుండా ముక్కులో డ్రిల్ బిట్ ఆన్ చేసి పెట్టుకోవడం, సల సలా మరిగే నూనెను చేతులతో త్రాగడం, 32 పొడవాటి కత్తులను గొంతులో దించుకోవడం, చెక్క ముక్కపై నుదిటితో మేకు కొట్టడం లాంటి  అద్భుత విన్యాసాలు ప్రేక్షకులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు ఈ ఉత్సవాలలో క్రాంతి కుమార్‌కు "సాహసవీర" అవార్డు ప్రదానం చేశారు. తన్వీర్ అరోరా స్టాండప్ కమెడియన్‌గా అందరినీ నవ్వించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని రన్నా జానీ ఆధ్వర్యంలో రాజేశ్వరి ఉదయగిరి, అంజనా జయంతి, అపర్ణ వంశీలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. 

ఈ కార్యక్రమంలో టెక్సస్ రాష్ట్రానికి చెందిన సీనియర్ డెమొక్రాట్, యూఎస్ కాంగ్రెస్ మెంబెర్ ఎడ్డీ బెర్నీ జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అమెరికా దేశం వివిధ సంస్కృతుల విభిన్న ఆచారాల ప్రవాసీయుల నిలయమని, ఈ దేశంలో వివక్షతకు తావు లేదని పేర్కొన్నారు. అమెరికా దేశ ప్రగతిలో వివిధ రంగాలలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతగానో ఉందని కొనియాడారు. టెక్సాస్ రాష్ట్ర సెనెటర్ జేన్ నెల్సన్  ఈ ప్రవాస భారతీయ ఉత్సవాన్ని గుర్తిస్తూ టెక్సాస్ రాష్ట్ర సెనేట్ నుండి ఒక ప్రశంసా పత్రాన్ని, అలాగే టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ మెంబెర్ టెర్రీ మీజా ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ పాత్రను ప్రశంసిస్తూ టెక్సాస్ చట్ట సభ నుండి ఒక ప్రత్యేక అభినందన పత్రాన్ని తీసుకువచ్చి చదివి వినిపించారు. వీరితో పాటు టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధులు జూలీ జాన్సన్, మ్యాట్ షహీన్‌లు పాల్గొని అమెరికా జన జీవన స్రవంతిలో ప్రవాస భారతీయుల పాత్ర ఇంకా పెరగవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 

ఇటీవలే నార్త్ కరోలినా రాష్ట్ర  సెనెటర్‌గా ఎన్నికైన  భారత సంతతికి చెందిన జై చౌదరి మాట్లాడుతూ ప్రవాస భారతీయులందరు ఐక్యతతో మెలుగుతూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని అన్నారు. భారత సంతతికి చెందిన వాషింగ్టన్ రాష్ట్ర సెనెటర్ మాంకా డింగ్ర తాను ఎన్నికల్లో గెలవడానికి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అందరి సహకారంతో గెలవగలిగానని అన్నారు. వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ నుండి కమ్యూనిటీ అఫైర్స్ మినిస్టర్ అనురాగ్ కుమార్, కాప్పెల్ నగర్ పోలీస్ చీఫ్ డానీ బార్టన్, కాప్పెల్ స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరిండేంట్ బ్రాడ్ హంట్, నగర కౌన్సిల్ మెంబర్ బిజూ మాత్యూ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. 

ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ మిలియన్ల సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయులందరు అమెరికా జన జీవన స్రవంతిలో భాగమవుతూ స్థానిక సమస్యలన్నీ తమ సమస్యలుగా భావించి అర్హత ఉన్న వారందరూ ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తమ వాణిని ఐకమత్యంగా బలంగా వినిపించకపోతే ప్రవాస భారతీయులకు సరైన గుర్తింపు లభించదు అన్నారు. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో ఓటరు నమోదు కార్యక్రమంలో బోర్డు సభ్యులు రావు కల్వల పర్యవేక్షణలో నిర్వహించామన్నారు. ఈ ఉత్సవంలో పాలుపంచుకోలేకపోయిన యూఎస్ కాంగ్రెస్ మెంబెర్ రాజా కృష్ణమూర్తి, మిచిగాన్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబెర్ పద్మ కుప్ప, టెక్సాస్ రాష్ట్రం నుంచి అమెరికా సెనెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న సెనెటర్ జాన్ కార్నిన్, సెనెటర్ టెడ్ క్రూజ్ లు ఐఏఎఫ్‌సీ తలపెట్టిన ఈ ప్రవాస భారతీయోత్సవాన్ని ప్రశంసిస్తూ వీడియో మెసేజ్ ద్వారా ప్రేక్షకులకు సందేశం పంపారు. తమ కార్యక్రమం చివరిలో రంగురంగుల కాంతులతో అత్యంత వైభవంగా జరిగిన ఫైర్ వర్క్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సంస్థ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర నేతృత్వంతో కూడిన ఈ ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’ లో బోర్డు అఫ్ డైరెక్టర్స్- జాన్ హేమండ్, రావు కల్వల, తైయబ్ కుండావాల, డా. చెన్నుపాటి రావు, పియూష్ పటేల్, మురళి వెన్నం, డా.సత్ గుప్తా, రన్నా జానీ, రామ్ కీ చేబ్రోలు, ప్రొఫెసర్. నిరంజన్ త్రిపాఠిలు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తమ వంతు కృషి చేశారు.  

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top