నేడు ఎన్సీపీ నేత పాటిల్ కాంగ్రెస్‌లో చేరిక | Yavatmal NCP's Uttamrao Patil faction all set to join Congress | Sakshi
Sakshi News home page

నేడు ఎన్సీపీ నేత పాటిల్ కాంగ్రెస్‌లో చేరిక

Sep 23 2014 10:28 PM | Updated on Oct 8 2018 6:02 PM

జిల్లాలో గట్టి పట్టున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు ఉత్తమ్‌రావ్ పాటిల్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

యవత్మాల్ : జిల్లాలో గట్టి పట్టున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు ఉత్తమ్‌రావ్ పాటిల్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన సొంత గ్రామమైన అర్ని తాలూకా లోనీలో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని మంగళవారం యవత్మాల్ జిల్లా కేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (వైడీసీసీ) చైర్మన్, ఉత్తమ్‌రావ్ పాటిల్ కుమారుడైన మనీష్ పాటిల్ తెలిపారు. జిల్లాపరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్ల మన్కర్ కూడా పాటిల్‌తోపాటు కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు.

డిప్యూటీ స్పీకర్ వసంత్ పర్కే, మంత్రి శివాజీరావ్ మోఘే సూచన మేరకు వారం కిందట సీఎం పృథ్వీరాజ్ చవాన్‌ను కలిసి తాము కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపామని మనీష్ వివరించారు. ఇంతకుముందు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ పాటిల్ దియోసర్కార్ సైతం పార్టీని వీడి శివసేనలో చేరిన విషయం తెలిసిందే.

 ఎన్సీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సందీప్ బజోరియా తిరిగి అక్కడ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టారు. ఆయనపై అసంతృప్తితో జిల్లాలోని చాలామంది ఎన్సీపీ నాయకులు పక్క  పార్టీల్లో చేరిపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement