భారత్‌పై కూడా అంతర్జాతీయ కోర్టుకెళితే.. | What if anybody goes to international court on india | Sakshi
Sakshi News home page

భారత్‌పై కూడా అంతర్జాతీయ కోర్టుకెళితే..

May 23 2017 3:28 PM | Updated on Sep 5 2017 11:49 AM

భారత్‌పై కూడా అంతర్జాతీయ కోర్టుకెళితే..

భారత్‌పై కూడా అంతర్జాతీయ కోర్టుకెళితే..

ఓ పౌరుడిని మానవ కవచంగా భద్రతా దళాలు ఉపయోగించడం అనైతికమే కాకుండా న్యాయవిరుద్ధం.

కశ్మీర్‌లో గతనెల అల్లరి మూకల రాళ్లదాడి నుంచి తప్పించుకునేందుకు ఓ కశ్మీరీని మానవ కవచంగా జీపు బానెట్‌కు కట్టేసిన సైనిక మేజర్‌ నితిన్‌ గొగోయ్‌కి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రశంసాపత్రాన్ని అందజేయడంపై ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌ ఈ సంఘటనను విమర్శించినందుకు.. రాళ్లు రువ్వే వ్యక్తికి బదులుగా అరుంధతీ రాయ్‌ని ఆ జీపుకు కట్టేసి ఉండాల్సిందని బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు పరేశ్‌ రావల్‌ ట్వీట్‌ చేశారు.

యుద్ధాలు, సంఘర్షణల సందర్భంగానే కాకుండా తిరుగుబాటుదారుల అణచివేతలో భాగంగా కూడా ఓ పౌరుడిని మానవ కవచంగా భద్రతా దళాలు ఉపయోగించడం అనైతికమే కాకుండా న్యాయవిరుద్ధం. నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (రోమ్‌ న్యాయ శాసనం), జెనీవా అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం శిక్షార్హమైన నేరం. దీన్ని యుద్ధనేరంగా పరిగణించాలని అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు న్యాయశాసనం చెబుతోంది. భారతీయుడైన కులభూషణ్‌ జాదవ్‌ ఉరిశిక్షపై అంతర్జాతీయ కోర్టును భారత్‌ ఆశ్రయించి ప్రాథమిక విజయాన్ని సాధించిన నేపథ్యంలోనే సైనిక మేజర్‌ నితిన్‌ను ప్రశంసించడం ఏ మేరకు సబబు. అంతర్జాతీయ కోర్టులో పాక్‌ను మట్టికరిపించామని మురిసిపోతున్న నేపథ్యంలో అరుంధతీరాయ్‌ లాంటి వాళ్లు ఇదే అంశంపై అంతర్జాతీయ కోర్టును ఆశ్రయిస్తే దేశం పరువేం గాను!

బ్రిటీష్‌ ఇండియా ఆర్మీ నుంచే భారత దేశ త్రివిధదళాలు పుట్టుకొచ్చినా మన దళాలకు ఓ ప్రత్యేకత ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ లాంటి దేశాల్లో లాగా రాజకీయ కుట్రలు, కుతంత్రాలు చేయవని, అసలు రాజకీయాల జోలికే వెళ్లవన్నది ఆ ప్రత్యేకత. అందుకని భారత దళాల దృక్పథాన్ని ‘విన్నింగ్‌ హార్ట్స్‌ అండ్‌ మైండ్స్‌ (వామ్‌) అని పిలుస్తారు. అందుకనే దేశంలో అక్కడక్కడ జరుగుతున్న తిరుగుబాటు ఆందోళనలను అణచివేసేందుకు సైన్యం పౌరులను మానవ కవచంగా ఉపయోగించుకున్న సందర్భాలు కశ్మీరు సంఘటన వరకు లేవు. ఇప్పుడు మన సైన్యాలకు రాజకీయ జబ్బు సోకినట్లు ఉంది. అయినా ఓ కశ్మీరీనీ మానవ కవచంగా ఉపయోగించుకోవడం వల్ల సాధించినదేంటి? కశ్మీర్‌లో అప్పటికీ ఇప్పటికీ ప్రజాందోళనలు పెరిగాయి తప్ప తగ్గలేదే! కశ్మీరీల హృదయాలను గెలుచుకున్నప్పుడే నిజమైన విజయాన్ని సాధించగలం.

– ఓ సెక్యులరిస్ట్‌ కామెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement