కశ్మీర్‌లో ‘సోషల్‌’పై నిషేధం ఎత్తివేత | Social Media Ban Removed In Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ‘సోషల్‌’పై నిషేధం ఎత్తివేత

Mar 5 2020 8:57 AM | Updated on Mar 5 2020 8:57 AM

Social Media Ban Removed In Kashmir - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జమ్మూకశ్మీర్‌లో సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేస్తూ అక్కడి పాలనా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేస్తూ అక్కడి పాలనా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. మార్చి 17 వరకు అన్ని వెబ్‌సైట్లను 2జీ స్పీడ్‌తో, ఫిక్స్‌డ్‌ లైన్‌ ఇంటర్నెట్‌తో వాడుకునేలా పరిమితి విధించారు. గతంలో జనవరి 25న ఇంటర్నెట్‌ సేవల పాక్షిక పునరుద్ధరణ జరిగినప్పుడు కొన్ని వెబ్‌సైట్లనే వాడే చాన్సుండేది. ఇప్పుడు పోస్ట్‌పెయిడ్‌ కనెక్షన్ల మాదిరిగా గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాకే ప్రీపెయిడ్‌ సిమ్‌లకు సేవలు అందుబాటులో ఉంటాయని హోంశాఖ ముఖ్య కార్యదర్శి షలీన్‌ తెలిపారు. అయితే హైస్పీడ్‌ 4జీ నెట్‌వర్క్‌ సేవలపై నిషేధం ఇప్పటికీ కొనసాగుతోంది.

సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేయడంపై మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇతిజ ట్విటర్‌లో స్పందించారు. సోషల్‌ మీడియాను నియంత్రించడం వల్ల ప్రయోజనం లేదని జమ్మూకశ్మీర్‌ పాలక యంత్రాంగం ఎట్టకేలకు తెలుసుకుందని వ్యాఖ్యానించారు. ఆర్టికల్‌ 370 రద్దు గతేడాది ఆగస్టు 5న తన తల్లి మెహబూబా ముఫ్తీ చివరిసారిగా ట్వీట్‌ చేశారని గుర్తు చేశారు. సోషల్‌ మీడియాపై నిషేధం తొలగించడంతో మొదటిసారి కశ్మీర్‌ నుంచి ట్వీట్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. గతేడాది ఆగస్టులో కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. (చదవండి: మధ్యప్రదేశ్‌లో మళ్లీ ఆపరేషన్‌ కమలం?)

Advertisement
 
Advertisement
Advertisement