దేశానికి రక్షణ కవచం అందించాం | Scientist Shashikala Sinha comment on Interceptor missile system | Sakshi
Sakshi News home page

దేశానికి రక్షణ కవచం అందించాం

Mar 7 2017 12:34 AM | Updated on Sep 5 2017 5:21 AM

దేశానికి రక్షణ కవచం అందించాం

దేశానికి రక్షణ కవచం అందించాం

ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి.. శత్రుదేశాలు ప్రయోగించే క్షిపణులను గాల్లోనే అడ్డుకుని పేల్చేయగల అద్భుత ఆయుధం.

ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి వ్యవస్థపై శాస్త్రవేత్త శశికళా సిన్హా
ఈ క్షిపణుల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన హైదరాబాదీ శాస్త్రవేత్త
స్వీయ రక్షణకు తోడ్పడే అద్భుతమైన వ్యవస్థ ఇది
మానవ ప్రమేయం లేకుండా పనిచేయగల సత్తా దీని సొంతం
ఎన్నో సవాళ్లు ఎదురైనా అధిగమించాం
చాలా తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసినట్లు వెల్లడి


ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి.. శత్రుదేశాలు ప్రయోగించే క్షిపణులను గాల్లోనే అడ్డుకుని పేల్చేయగల అద్భుత ఆయుధం. పదహారేళ్ల శ్రమ ఫలంగా భారత్‌ ఈ రకమైన క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ఈ సామర్థ్యం గల ఐదో దేశంగా ఎదిగింది. మరి ఈ ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి అభివృద్ధి వెనుక మన హైదరాబాదీ శాస్త్రవేత్త కీలకపాత్ర పోషించారని తెలుసా? ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్‌ (ఈసీఈ) అభ్యసించిన శశికళా సిన్హా... కొద్దికాలం పాటు ముంబైలోని టీఐఎఫ్‌ఆర్‌లో పనిచేశారు. తర్వాత డీఆర్‌డీవోలో చేరారు. ప్రస్తుతం ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న సిన్హా.. ఆ క్షిపణి ప్రత్యేకతలు, దేశానికి వాటి అవసరం గురించి ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు..
    – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

గాల్లోనే పేల్చేస్తుంది
అగ్ని, త్రిశూల్, ఆకాశ్‌ వంటి క్షిపణుల పేర్లు చాలా మందికి తెలుసు. అవన్నీ మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మొదలుపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్‌ మిస్సైల్‌ ప్రోగ్రామ్‌ (ఐజీఎంపీ)లో భాగంగా అభివృద్ధి చేసినవి. అయితే దాదాపు 16 ఏళ్ల క్రితం దేశానికి అన్నివైపుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని ఒక రక్షణ కవచం అవసరముందని గుర్తించారు. దాంతో ఇంటర్‌సెప్టార్‌ మిస్సైల్‌ ప్రాజెక్టు మొదలైంది. శత్రువులు మనపైకి ప్రయోగించే క్షిపణులను గాలిలోనే అడ్డుకుని అక్కడే ధ్వంసం చేసేలా క్షిపణులను సిద్ధం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ మధ్యే ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించాం. ఈ ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి మనపైకి వచ్చే శత్రుదేశ క్షిపణులను అడ్డుకుంటుందేగానీ.. ప్రతిదాడులు చేసేందుకు కాదు. భారత్‌ వైపు నుంచి తొలిదాడి జరగదన్న మన విధానానికి అనుగుణంగా.. మనల్ని మనం రక్షించుకునేందుకు ఈ రకమైన క్షిపణులు తప్పనిసరి.

మనదైన ముద్ర వేశాం
ఇంటర్‌సెప్టార్‌ క్షిపణికి సంబంధించి రెండు పరీక్షలు నిర్వహించాం. ఒకటి భూ వాతావరణం లోపలే (ఎండోమెట్రిక్‌) ప్రత్యర్థి క్షిపణిని ఢీకొనేదైతే.. రెండోది అవతల (ఎక్సోమెట్రిక్‌) పనిచేసేది. ఈ రెండూ సంతృప్తికర ఫలితాలిచ్చాయి. ఇది ఎన్నో విధాలుగా ప్రత్యేకమైన క్షిపణి. ఎందుకంటే సాధారణంగా శత్రువులపై దాడి చేసే సమయంలో లక్ష్యాలు మారిపోవు. కొంత సమయం అటుఇటుగానైనా దాడులు చేయవచ్చు. ఇంటర్‌సెప్టార్‌ విషయం ఇలా కాదు. తగిన సమయంలో తగిన వేగం, కోణంతో శత్రు క్షిపణిని ఢీకొట్టాలి. సెకనులో వెయ్యోవంతు కంటే తక్కువ సమయం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఇది ఒక బుల్లెట్‌ను ఇంకో బుల్లెట్‌తో ఢీకొనడం వంటిదని చెప్పాలి. 40 కిలోమీటర్ల పరిధి ఉండే ఈ ఇంటర్‌సెప్టార్లు భూమికి 16 కిలోమీటర్ల ఎత్తులో శత్రు క్షిపణులను అడ్డుకోగలవు.

అగ్రరాజ్యాలకు తీసిపోకుండా..
భారత్‌ అభివృద్ధి చేసిన ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి అగ్రరాజ్యాల క్షిపణులకు ఏమాత్రం తీసిపోదు. ఇటీవల మనం పరీక్షించిన క్షిపణి అమెరికాకు చెందిన ప్యాక్‌–3 , రష్యాకు చెందిన 9ఎం శ్రేణి క్షిపణుల కంటే మెరుగైన ఫలితాలు కనబరిచింది. పైగా మిగతా దేశాల కంటే చాలా తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేశాం.

అంతా ఆటోమేటిక్‌..
ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి విషయంలో మానవ ప్రమేయం చాలా తక్కువ. మన స్థావరాలు, వ్యూహాత్మక కేంద్రాలవైపు ఏదైనా క్షిపణి దూసుకొస్తోందని రాడార్లు గుర్తిస్తే చాలు.. సమాచార, నియంత్రణ వ్యవస్థలు రంగంలోకి దిగుతాయి. లక్ష్యాన్ని గుర్తించి, వర్గీకరించ డం అంతా ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ అల్గారిథమ్‌ల సాయంతో జరిగిపోతుంది. ఆ వెంటనే మన ఇంటర్‌సె ప్టార్‌ క్షిపణి దూసుకెళ్లి, శత్రుదేశ క్షిపణిని ముక్కలు చేస్తుంది. మానవ ప్రమేయం ఏమాత్రం లేని కారణం గానే ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నాం.

వినియోగానికి సిద్ధం
ఇంటర్‌సెప్టార్‌ క్షిపణికి సంబంధించిన అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. మూడేళ్ల క్రితమే క్షిపణికి సంబంధించిన అన్ని అంశాలను నిర్ధారించినా.. వార్‌హెడ్‌కు సంబంధించి పనులు మూడేళ్ల క్రితమే పూర్తయ్యాయి. మార్చి ఒకటిన జరిగిన పరీక్ష వార్‌హెడ్‌తో జరిగిందే. ప్రభుత్వం ఈ వ్యవస్థల ఏర్పాటుకు ముందుకొస్తే చాలు.. రెండు మూడేళ్లలో దేశం మొత్తానికి రక్షణ ఛత్రాన్ని ఏర్పాటు చేయగలం.

ఎండోమెట్రిక్, ఎక్సోమెట్రిక్‌ క్షిపణుల మధ్య తేడా ఏమిటి?
ఎక్సోమెట్రిక్‌ క్షిపణుల విషయంలో కొన్ని సవాళ్లు ఉంటాయి. శత్రువు మన దృష్టి మరల్చేందుకు కొన్ని డమ్మీ క్షిపణులను విడుదల చేయవచ్చు. వాటి మధ్యలో అసలు క్షిపణిని గుర్తించి నాశనం చేసేందుకు అనేక టెక్నాలజీలను, ఆన్‌బోర్డ్, గ్రౌండ్‌ సెన్సర్లను ఉపయోగిస్తున్నాం. మన దృష్టి మరల్చేందుకు శత్రువులు ఉపయోగించే నిప్పు కణికల (ఫ్లేర్స్‌)ను కూడా ఇమేజ్‌ సెన్సింగ్‌ సీకర్ల ద్వారా గుర్తించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఇక ఎండోమెట్రిక్‌ క్షిపణుల విషయానికొస్తే శత్రు క్షిపణిని నేరుగా ఢీకొట్టించగలగడం సవాలుగానే నిలిచింది.

Advertisement

పోల్

Advertisement