మతగురువులకు క్యాబినెట్‌ హోదా | Sakshi
Sakshi News home page

మతగురువులకు క్యాబినెట్‌ హోదా

Published Wed, Apr 4 2018 2:21 PM

Religious Leaders Got Minister Status In Madhya Pradesh - Sakshi

భోపాల్‌ : ఉత్తరాది రాజకీయాలపై మత ప్రభావం ఎంతగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఐదుగురు మతగరువులకు క్యాబినెట్‌ హోదా కల్పించడమే ఇందుకు ఉదాహరణ. నర్మదానంద్‌ మహరాజ్‌, హరిహరానంద్‌ మహరాజ్‌, కంప్యూటర్‌ బాబా, భయ్యూ మహరాజ్‌, పండిత్‌ యోగేంద్ర మహంత్‌లు మతగురువుల నుంచి క్యాబినెట్‌ హోదా పాందారు. వీరు నర్మదా నది సంరక్షణా కమిటీ సభ్యులుగా ఉన్నారు.

నర్మాదా నది పరిరక్షణా కమిటీ సభ్యులు కావడం వల్లే వారికి పదవులు వచ్చాయని, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం బాబాలకు మంత్రి పదవులు ఇవ్వటం ద్వారా రాజకీయంగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్రం చేస్తోందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పంకజ్‌ చతుర్వేది మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ నర్మదా నది పరిరక్షణను గాలికి వదిలేశారని, ​చేసిన పాపాలను కడుక్కోవడానికే వారికి మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు.

కమిటీలో సభ్యులుగా ఉన్న ఐదుగురు నర్మదా నది ఒడ్డున ఆరుకోట్ల మొక్కలు  నాటారో లేదో తేల్చాలన్నారు. బీజేపి అధికార ప్రతినిధి రజనీష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకులకు మతగురువులకు సంబంధించిన విషయాలు నచ్చినట్లుగా లేవన్నారు. కమిటీ సభ్యులుగా ఉన్న ఐదుగురికి నర్మదా నది పరిరక్షణపై సరైన అవగాహన ఉందన్న కారణంతో మంత్రి పదవులు ఇచ్చామని స్సష్టం చేశారు. ప్రజల్ని నర్మరా నది పరిరక్షణలో కలుపుకుని పోవడానికి వీరి పాత్ర అవసరమన్నారు. ఇదిలా ఉండగా కంప్యూటర్‌ బాబా నర్మదా నది పరిరక్షణ పనుల్లో అవినీతి జరిగిందని చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది.
 

Advertisement
Advertisement