కిడ్నీ రాకెట్లో అపోలో డాక్టర్ల విచారణ | police to question delhi apollo doctors in kidney racket | Sakshi
Sakshi News home page

కిడ్నీ రాకెట్లో అపోలో డాక్టర్ల విచారణ

Jul 1 2016 4:15 PM | Updated on Aug 20 2018 2:31 PM

ఇటీవల బయటపడిన కిడ్నీ రాకెట్కు సంబంధించి ఢిల్లీలోని ఇం‍ద్రప్రస్థ అపోలో ఆస్పత్రికి చెందిన నలుగురు లేదా ఐదుగురు వైద్యులను పోలీసులు విచారించనున్నారు.

ఇటీవల బయటపడిన కిడ్నీ రాకెట్కు సంబంధించి ఢిల్లీలోని ఇం‍ద్రప్రస్థ అపోలో ఆస్పత్రికి చెందిన నలుగురు లేదా ఐదుగురు వైద్యులను పోలీసులు విచారించనున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆగ్నేయ మండలం జాయింట్ కమిషనర్ రాజేందర్ పాల్ ఉపాధ్యాయ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ఆ ఆస్పత్రిలోని వైద్యులకు సమన్లు పంపుతామని, ప్రధానంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినవారినే పిలుస్తామని ఆయన అన్నారు. డాక్టర్ అశోక్‌ సరిన్, డాక్టర్ అన్షుమన్ అగర్వాల్ తదితర డాక్టర్లతో పాటు వాళ్ల పీఏలు అయిన శైలేష్ సక్సేనా, ఆదిత్య సింగ్లను కూడా పిలిపిస్తామని తెలిపారు. ఈ కిడ్నీ రాకెట్లో ఇంకా అసీమ్ సిక్దర్, సత్యప్రకాష్, దేవాశీష్ మౌలిక్ తదితరుల హస్తం కూడా ఉందని తెలిపారు. ఇందులో మరింతమంది వైద్యుల హస్తం కూడా ఉండే అవకాశం ఉందన్నారు.  

జూన్ రెండో తేదీన ఢిల్లీ పోలీసులు ఈ కిడ్నీ రాకెట్ను ఛేదించారు. ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రికి చెందిన ఇద్దరు ఉద్యోగులతో పాటు ముగ్గురు కిడ్నీ బ్రోకర్లను కూడా అరెస్టు చేశారు. కోల్కతాకు చెందిన టి. రాజ్కుమార్ ఈ రాకెట్ సూత్రధారి. అతడతో పాటు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు, పశ్చిమబెంగాల్ లోని సిలిగురి జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ జలమండలి అధికారి భూలేసింగ్ కుమారుడు అశుతోష్ కూడా ఇలాంటి బ్రోకర్ల ద్వారానే కిడ్నీ పొందినందుకు అతడిని సైతం జూన్ 23న పోలీసులు అరెస్టుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement