కుదిపేస్తున్న నోట్లు.. పార్లమెంటులో రచ్చ | Opposition Creates Ruckus, Rajya Sabha Adjourned | Sakshi
Sakshi News home page

కుదిపేస్తున్న నోట్లు.. పార్లమెంటులో రచ్చ

Nov 17 2016 11:35 AM | Updated on Jun 4 2019 8:03 PM

రెండో రోజు కూడా నోట్ల రద్దు అంశం పార్లమెంటును కుదిపేసింది.

న్యూఢిల్లీ: రెండో రోజు కూడా నోట్ల రద్దు అంశం పార్లమెంటును కుదిపేసింది. పెద్ద నోట్ల రద్దును కేంద్ర ప్రభుత్వం సమర్థించుకోగా రెండో రోజు కూడా ఇదే రచ్చతో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. అటు లోక్ సభ, రాజ్యసభలో ఈ అంశంపైనే గందరగోళ పరిస్థితి నెలకొంది. లోక్ సభలో కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్ సహా మొత్తం 21 నోటీసులు ఇచ్చాయి. పెద్ద నోట్ల రద్దు విషయంపై చర్చ చేపట్టాల్సిందేనని ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలతో హోరెత్తించాయి.

దీంతో రెండో రోజు పార్లమెంటు సమావేశాలను నోట్ల రద్దు అంశం కుదిపేసినట్లయింది. రాజ్యసభ చైర్మన్ పోడియంను విపక్షాలు చుట్టుముట్టడంతో 11.30గంటల వరకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైనా ఆందోళన తగ్గకపోవడంతో మరోసారి 12గంటలవరకు వాయిదా పడింది. అంతకుముందు, పార్లమెంటు వెలుపల తృణమూల్ ఎంపీలు ఆందోళనకు దిగారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. నల్లధనంపై ఉమ్మడి పోరాటం చేయాలని కోరారు. మరోపక్క, ఎంతో సున్నితమైన ఈ అంశంపై ప్రధాని సమాధానం ఇ‍వ్వాలని, ప్రధాని నరేంద్రమోదీ సభలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి దేశం మొత్తం అండగా ఉందని కేంద్ర మంత్రి అనంత కుమార్ అన్నారు. చర్చకు తాము సిద్ధమని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement