ఆదర్శం ఈ కశ్మీరీ బ్రదర్స్‌..!

Inspirational Blind Kashmir Brothers As Quilt Makers - Sakshi

శ్రీనగర్‌ : పరీక్షల్లో ఫెయిలయ్యామని ఒకరు, కోరుకుంది దక్కలేదని మరొకరు, తల్లిదండ్రులు మందలించారని ఇంకొకరు.. ఇలా క్షణికావేశంలో నిండు ప్రాణాలు బలిపెడుతున్న వారికి ఈ అన్నదమ్ములు ఒక పాఠం. పుట్టుకతోనే అంధులయినా గులామ్‌ నభి తేలి (45), మొహమ్మద్‌ హుస్సేన్‌ (40) ఏనాడు ఆధైర్య పడలేదు. తండ్రి మార్గనిర్దేశంలో నడిచి సొంత కాళ్లపై నిలబడ్డారు. డెహ్రాడూన్‌లోని జాతీయ అంధుల సంస్థలో బ్రెయిలీ లిపి, కొన్ని హోమ్‌ సైన్స్‌ ప్రొగ్రాములు నేర్చుకుని పరుపుల తయారీలో నైపుణ్యం సాధించారు. జీవితాన్ని జీవించేందుకే అని చాటిచెబుతూ.. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. భూమికి భారంగా మారాం అని కాకుండా..కష్టించి పనిచేయాలని సూచిస్తున్నారు. కళ్లు లేకపోతేనేమీ.. కాస్తంత తెలివి.. ఇంకాస్త సత్తువ ఉన్నాయి కదా అంటున్నారు.

‘ఎవరో మనపై జాలి చూపించే బదులు.. మనమే జాలీగా ఉంటే సరిపోద్ది. చేసే పనిని ప్రేమించడమే మా ఆనందానికి మూలం’ అని పనిలో మునిగారు కశ్మీరీ అన్నదమ్ములు. ఇక వీరు తయారు చేసే పరుపులకు స్థానికంగా మంచి డిమాండ్‌ ఉంది. డీలర్లు తేలి బ్రదర్స్‌కు ఆర్డర్లు ఇవ్వడానికి ఆసక్తి చూపుతుంటారు. ‘జాతీయ అంధుల సంస్థలో ట్రెయినింగ్‌ తీసుకుని సొంత కాళ్లపై నిలబడ్డాం. మా తల్లిదండ్రులు యాచక వృత్తికి వ్యతిరేకం. అదొక్కటి తప్పించి బతకడానికి మరే పని చేసినా ఫరవాలేదని చెప్తారు. మా నాన్నతో కలిసి పనిచేయడం. కుటుంబ పోషణలో భాగం కావడం నిజంగా ఆనందంగా ఉంది’ అన్నారు మొహమ్మద్‌ హుస్సేన్‌. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top