డీడీసీఏపై విచారణకు ఆదేశం | Delhi Government to constitute commission of enquiry | Sakshi
Sakshi News home page

డీడీసీఏపై విచారణకు ఆదేశం

Dec 20 2015 8:06 PM | Updated on Sep 3 2017 2:18 PM

డీడీసీఏపై విచారణకు ఆదేశం

డీడీసీఏపై విచారణకు ఆదేశం

ఢిల్లీ, డిస్ట్రిక్‌ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.

ఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్‌ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. గతంలో డీడీసీఏ కు అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారీ ఎత్తున అవతవకలు జరిగాయనేది కేజ్రీవాల్ ప్రధాన ఆరోపణ. డీడీసీఏలో 2013 వరకూ 13 సంవత్సరాల పాటు అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన అవినీతికి పాల్పడటంతో పాటు అందుకు ఢిల్లీ క్రికెట్ బాడీలోని సభ్యులు సహకరించారని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. విచారణ కమిషన్ కు రాజ్యాంగ నిపుణుడు గోపాల్ సుబ్రహ్మణ్యం నేతృత్వం వహించనున్నారు. కమిషన్ కు నేతృత్వం వహించాలని తాను కోరగా, గోపాల్ సుబ్రహ్మణ్యం అంగీకరించారని కేజ్రీవాల్ ట్విటర్ ద్వారా తెలిపారు.

కాగా, అంతకుముందు కూడా డీడీసీఏలో అవినీతి అంశానికి సంబంధించి కేజ్రీవాల్ ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ను విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. 2008-12 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రూ.24.45 కోట్ల వినోదపు పన్నును డీడీసీఏ ఎగ్గొట్టిందని కేజ్రీవాల్ ఆరోపిస్తూ దర్యాప్తుకు ఆదేశించారు. అది దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య సిరీస్ జరుగుతున్న సమయం కావడంతో అప్పట్లో ఢిల్లీ టెస్టుపై నీలి మేఘాలు అలుముకున్నాయి. అయితే మ్యాచ్ నిర్వహణపై హామీగా కోటి రూపాయిలను ప్రభుత్వానికి చెల్లించాలని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేయడంతో డీడీసీఏకు ఊరట లభించింది. దీంతో ఆ టెస్టు మ్యాచ్ ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement