పెట్టుబడుల ఆకర్షణలో ఢిల్లీ టాప్
న్యూఢిల్లీ: అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించగల రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఢిల్లీ తొలి స్థానంలో నిలిచింది. ఎన్సీఏఈఆర్ (నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్) 2016 నుంచి ఈ జాబితాను రూపొందిస్తుండగా 2016, 17లలో గుజరాత్ తొలి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఢిల్లీ ఆ స్థానాన్ని దక్కించుకుంది. తమిళనాడు రెండో స్థానంలో నిలవగా గుజరాత్ మూడో స్థానానికి పడిపోయింది. తర్వాతి స్థానాల్లో వరుసగా హరియాణా, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. వ్యాపార సంస్థలకు స్థలం, మానవ వనరులు, మౌలిక వసతుల లభ్యత, ఆర్థిక వాతావరణం, పరిపాలన, రాజకీయ సుస్థిరత, వాణిజ్య దృక్పథం అనే 6 అంశాల ఆధారంగా జాబితా రూపొందించింది.