గత యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టం సరిగా లేదని పలు రాష్ట్రాలు విమర్శించాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఈ చట్టాన్ని హడావుడిగా తీసుకువచ్చారని ధ్వజమెత్తాయి.
న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టం సరిగా లేదని పలు రాష్ట్రాలు విమర్శించాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఈ చట్టాన్ని హడావుడిగా తీసుకువచ్చారని ధ్వజమెత్తాయి. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల రెవెన్యూ మంత్రులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భూసేకరణ చట్టంలోని నిబంధనలు చిన్న ప్రాజెక్టులకు కూడా అవాంతరాలు కల్పించేలా ఉన్నాయని బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులు దుయ్యబట్టారు.
అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని హర్యానా, కర్ణాటక, కేరళ మంత్రులతోపాటు, అన్నాడీఎంకే, సమాజ్వాదీ పార్టీ, బీజేడీ మంత్రులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిలో మార్పులు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలను కేంద్రం సవరించే అవకాశముందని తెలుస్తోంది. భూసేకరణ విషయంలో తమ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. రైతులకు నష్టపరిహారం, పునరావాసం అంశాల్లో రాజీపడబోమని పేర్కొన్నారు.