
జాతి గుండెల్లో అంబేడ్కర్
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
- ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జాతి యావత్తూ ఆయన సేవలను స్మరించుకుంది. రాజకీయ ప్రముఖులు, బహుజనులు నివాళులు అర్పించారు. అంబేడ్కర్ కన్న కలలు సాకారం కావాలని అభిలషించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఢిల్లీలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. అంబేడ్కర్ సేవలను కొనియాడారు.
కోట్లాది మంది భారతీయుల గుండెల్లో కొలువైన యుగపురుషుడిగా అంబేడ్కర్ను అభివర్ణిస్తూ.. ఆయన ఆశయాల సాధనకు జాతి పునరంకితం కావాలన్నారు. మధ్యప్రదేశ్లో అంబేడ్కర్ జన్మస్థలం మహ్వాలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరోవైపు అంబేడ్కర్కు తగిన గుర్తింపు ఇవ్వలేదంటూ రాజకీయ నేతలు విమర్శలు గుప్పించుకున్నారు. అంబేడ్కర్, నేతాజీ, సర్దార్ పటేల్కు కాంగ్రెస్ తన పాలనలో ప్రాధాన్యం ఇవ్వలేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దుయ్యబట్టారు. 1953లోనే ఉస్మానియా వర్సిటీ అంబేడ్కర్కు గౌరవ డాక్టరేట్ ఇచ్చిందన్నారు. అంబేడ్కర్ పేరును బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవాలని చూస్తోందంటూ కాంగ్రెస్ మండిపడింది. దళితుల పథకాల నిధులకు యూపీఏ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తే.. ఎన్డీఏ సర్కారు కోత విధిస్తోందని కాంగ్రెస్ ఎంపీ, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీఎల్ పునియా విమర్శించారు.