సమానత్వం కోసం మానవహారం | 620 km womens wall from Kasargod to Thiruvananthapuram | Sakshi
Sakshi News home page

సమానత్వం కోసం మానవహారం

Jan 2 2019 3:05 AM | Updated on Jan 2 2019 4:55 AM

620 km womens wall from Kasargod to Thiruvananthapuram - Sakshi

తిరువనంతపురం: స్త్రీ–పురుష సమానత్వం కోసం కేరళలో మహిళలు  కదంతొక్కారు. మంగళవారం 65వ జాతీయ రహదారిపై కాసర్‌గఢ్‌ నుంచి దక్షిణ కొన వరకు 620 కిలోమీటర్ల పొడవున మహిళలు మానవహారం చేపట్టారు. మంగళవారం సాయంత్రం  ప్రారంభమైన ఈ మానవహారంలో వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. వారికి సంఘీభావంగా పురుషులు మానవహారం చేపట్టారు. మానవహారం ద్వారా కులం, మతం అనే అడ్డుగోడలను మహిళలు కూలదోస్తారని కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. కాసరగఢ్‌ వద్ద ఆరోగ్య మంత్రి షిలాజా, వెలయంబలమంలో సీపీఐ జాతీయ నేత బృందాకారత్‌ మానవహారంలో పాల్గొన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ మానవహారానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి ముందు సీఎం విజయన్‌ సామాజిక సంస్కర్త ’అయ్యంకాలి’ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

మానవహారంపై బీజేపీ కార్యకర్తల దాడి
కాసర్‌గఢ్‌ జిల్లాలోని చెట్టుకుండ్‌లో బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు మానవ హారంపై దాడికి తెగబడ్డారు. మహిళలు, పోలీసులపై రాళ్లు రువ్వడంతో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. రెండు మీడియా చానల్స్‌ సిబ్బందిపై దాడి చేసి ఘటనకు సంబంధించిన వీడియోలను తొలగించా ల్సిందిగా బెదిరించారు. జాతీయ రహదారిపై నిలబడి ఉన్న మహిళలకు దగ్గరలోని పొదలకు కొంతమంది నిప్పు పెట్టారని, వారిని పట్టుకోవడానికి  ప్రయత్నించడంతో పోలీసులపై రాళ్ళ దాడి చేశారని జిల్లా పోలీసు అధికారి అబ్దుల్‌ కరీం చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement