పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది | Sakshi
Sakshi News home page

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

Published Sat, May 25 2019 2:22 PM

Rajasekhar Comments On Pawan Kalyan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆం​ధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చారిత్రక విజయం సాధించారని, అందులో తాము కూడా భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నా​మని హీరో రాజశేఖర్‌ అన్నారు. తన భార్య జీవితతో కలిసి శనివారం ఆయన విలే​కరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయంలోనూ మా పాత్ర ఉండటం ఆనందంగా ఉంది. జగన్ పాదయాత్రలో పాల్గొన్నప్పుడే విజయ సంకేతాలు అందాయి. జగన్ గెలుస్తాడని ముందే తెలుసు. జగన్‌కు ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ‘మా’ ఎన్నికల్లో మద్దతిచ్చిన నాగబాబుకు మాకు ఎలాంటి విబేధాలు లేవు. ఎన్నికల్లో నాగబాబుకు వ్యతిరేకంగా ఎక్కడ ప్రచారం చేయలేదు. పవన్ కళ్యాణ్‌పై జాలి వేసింది, ఒక్క చోటైనా గెలిస్తే బాగుండేద’ని రాజశేఖర్‌ అన్నారు.

రోజా గెలవడం అదృష్టం: జీవిత
వైఎస్‌ జగన్ గత పదేళ్లుగా ప్రజలతోనే ఉన్నారని, సామాన్యుడిలా పాదయాత్ర చేసి ప్రజలను కలిశారని జీవిత చెప్పారు. అంకితభావంతో కష్టపడిన జగన్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారని, వచ్చే పదేళ్లు ఆయనదేనని వ్యాఖ్యానించారు. తాము ప్రచారం చేసిన ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీ సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నాగబాబుపై, తమపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ ఎన్నికల్లో నాగబాబు తమకు అండగా నిలబడ్డారని వెల్లడించారు. ‘ప్రజలు చాలా తెలివిగా కేంద్రంలో ఎన్డీఏను, రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీని గెలిపించారు. ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ప్రత్యేక హోదా తీసుకువచ్చి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. రోజా గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె గెలవడం వైఎస్సార్‌సీపీ అదృష్టం. రోజాకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నా’ని జీవిత అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement