
తొలి రోజే ప్రభాస్ నమ్మాడు: రాజమౌళి
తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి.
హైదరాబాద్: తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి ఫ్రాంచైజీలో వస్తున్న సీక్వెల్ మూవీ బాహుబలి-2 కోసం టాలీవుడ్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. బాహుబలి ప్రాజెక్టు గురించి ఇటీవల ఓ సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ.. తమ హీరో ప్రభాస్ షూటింగ్ మొదలైన తొలిరోజు నుంచే మూవీపై ఎంతో నమ్మకంగా ఉన్నాడని చెప్పారు. మూవీ యూనిట్కు ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందని ప్రభాస్ అప్పుడే ఊహించాడని అన్నారు.
ఆ నమ్మకంతోనే ప్రభాస్ ఎంతో మనసుపెట్టి, తీవ్రంగా శ్రమించడంతో పాటు యూనిట్ అందరికీ ప్రభాస్ ఎంతో స్ఫూర్తిగా నిలిచాడని రాజమౌళి కొనియాడారు. 'బాహుబలి: ది బిగినింగ్' సీక్వెల్ గా తెరకెక్కిన బాహుబలి–2 ఈ నెల 28న రికార్డుస్థాయిలో 6500 థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. త్రిడీలో విడుదల చేయాలని భావించామని, అయితే ఆ స్థాయిలో పిక్సల్స్ను క్యాప్చర్ చేయడం కష్టమన్నారు. మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ ప్లస్ పాయింట్ అని.. త్రిడీలో అది ప్రభావవంతంగా కనిపించదని నిర్మాత శోభు యార్లగడ్డ కూడా భావించారని మరిన్ని విషయాలను రాజమౌళి వివరించారు.