మధ్యతరగతిపై పన్నుల భారం

common people are unhappy with 2018 budget - Sakshi

కార్మికులు, ఉద్యోగుల పెదవివిరుపు

బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు    

కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విభిన్న రకాల వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపారని, ప్రభుత్వ ఉద్యోగుల సహితం బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకించి బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు జరపలేదని, ప్రజలపై భారాలు మోపుతుందంటున్నారు.

 పెట్టుబడి దారులకు కొమ్ముకాసే బడ్జెట్‌ 
కల్లూరురూరల్‌: కేంద్రం ప్రభుత్వం గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ కార్మిక సంక్షేమాన్ని తుంగలో తొక్కి పెట్టుబడి దారులకు ఊతం ఇచ్చేలాగా వుందని సీపీఎం మండల కార్యదర్శి తన్నీరు కృష్ణార్జునరావు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్‌లో పేదలకు ఎటువంటి మేలు జరిగే అవకాశం లేదని, అంకెల గారడితో ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసగించిందన్నారు.   రెతులకు ఎలాంటి ఉపయోగం కలగదన్నారు. 

 – తన్నీరు కృష్ణార్జునరావు, సీపీఎం మండల కార్యదర్శి

 మద్దతు ధరతో రైతుకు మేలు  
తల్లాడ: బడ్డెట్‌లో కనీస మద్దతు ధర కల్పించడం హర్షదాయకం. పత్తి, మిర్చి వంటి పంటలు ప్రతి ఏటా మద్దతు ధర లేక రైతాంగం నష్ట పోతుంది. రైతుల పరిస్థితి, వారి కష్టాలను చూసిన కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని నిర్ణయించింది. వ్యవసాయం రంగంలో రుణాలు ఇప్పించడానికి రూ.11 లక్షల కోట్లు కేటాయించినట్లు ప్రకటించటం  మంచిదే. రైతులకు ఉపయోగ పడే విధంగా ఈ బడ్జెట్‌ ఉన్నది.

– దగ్గుల శ్రీనివాసరెడ్డి, రైతు, తల్లాడ  

మాలాంటోళ్లకు ధైర్యం కలిగించింది 
మాది పేద కుటుంబం.  కేంద్ర ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డు దారులకు సంవత్సరానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని బడ్జెట్‌లో చెప్పటం మాలాంటోళ్లకు ధైర్యం కలిగించింది.    

– ఎం.నాగబాబు, సత్తుపల్లి   

ఆరోగ్య బీమా మంచిది 
చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని నడిపిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామనటం చాలా మంచిది. వీటితో పిల్లలను మంచిగా చదించటానికి అవకాశం లభిస్తుంది.

 – చిత్తలూరి నర్సింహారావు, సత్తుపల్లి  

నిరుద్యోగులకు నిరాశే 
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నిధులు కేటాయించకపోవటం దారుణం. నిరుద్యోగులకు నిరాశే కలిగించింది.  సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఒనగూరిందేమీ లేదు. ఇది ధనులకు ఉపయోగపడేవిధంగా ఉంది.

 – భీమిరెడ్డి పుల్లారెడ్డి, వేంసూరు

 గ్యాస్‌ పొయ్యి ఇస్తే పొగ బాధ తప్పినట్లే 
కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. కట్టెల పొయ్యి మీద పొగతో వంట చేసుకునే మాలాంటి వాళ్ళకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తే పొగ కష్టాలు తీరుతాయి.  

 – జినుగు రాణి, పెనుబల్లి  
 

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top