అలియాబాద్‌లో అదృశ్యం.. బాపట్లలో ప్రత్యక్షం | kidnaped boy found in bapatla | Sakshi
Sakshi News home page

అలియాబాద్‌లో అదృశ్యం.. బాపట్లలో ప్రత్యక్షం

Oct 27 2015 8:31 AM | Updated on Sep 3 2017 11:34 AM

అలియాబాద్‌లో అదృశ్యం.. బాపట్లలో ప్రత్యక్షం

అలియాబాద్‌లో అదృశ్యం.. బాపట్లలో ప్రత్యక్షం

శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన బాలుడి కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమయ్యింది.

బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
 

హైదరాబాద్: శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన బాలుడి కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమయ్యింది. అలియాబాద్ మేకలబండలో ఆదివారం సాయంత్రం అదృశ్యమైన బాలుడు సోమవారం గుంటూరు జిల్లా బాపట్లలో పోలీసులకు చిక్కడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... శబరీష్ తమ ఆధీనంలో ఉన్నట్లు బాపట్ల పోలీసులు తమకు సమాచారం అందించారని, పోలీసులను అక్కడికి పంపుతున్నట్లు తెలిపారు. బాపట్లలో రైలులో ఏడుస్తున్న శబరీష్‌ను గుర్తించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు అందించగా, వారు అతడిని  అదుపులోకి తీసుకొని తమకు సమాచారం అందించారన్నారు.


వివరాల్లోకి వెళితే... మేకబండకు చెందిన బీజేవైఎం రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు పొన్న వెంకటరమణ కుమారుడు పొన్న శబరీష్(15) శంషీర్‌గంజ్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఆడుకునేందుకు  వెళ్లిన శబరీష్ తిరిగి ఇంటికి రాలేదు.  దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు శాలిబండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా అదే ప్రాంతానికి చెందిన  శారద అనే మహిళ ఆదివారం రాత్రి 7.30 గంటల  ప్రాంతంలో శబరీష్‌ను సికింద్రాబాద్ 1వ నంబర్ ప్లాట్ ఫారంపై చూసినట్లు సోమవారం అతని తండ్రికి తెలిపింది. దీంతో పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఎలాంటి ఫలితం కనిపించలేదని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
 

 ఆరు బృందాలతో గాలింపు

 బాలుడి అదృశ్యాన్ని సీరియస్‌గా తీసుకున్న శాలిబండ పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.  ఈ సందర్భంగా అతను చదువుతున్న స్కూల్‌కు వెళ్లి విద్యార్థులను ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం వారి ఇంటి వద్దే శబరీష్‌ను  చివరి సారిగా చూసిన ముగ్గురి సాక్షులను కూడా పోలీసులు విచారించారు. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాలుడితో మాట్లాతుండగా చూసినట్లు పొన్న ప్రకాష్ అనే  బాలుడు తెలిపాడు.
 

 ఎనిమిది మంది కలిసి కిడ్నాప్ చేశారు: శబరీష్

 అలియాబాద్‌లో ఆదివారం సాయంత్రం ఎనిమిది మంది కలిసి తన మూతికి బట్ట కట్టి కిడ్నాప్ చేశారని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వారి దృష్టి మరల్చి తాను విశాఖపట్నం రెలైక్కానని... విశాఖపట్నం నుంచి తిరిగి ‘బొకారో’ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటికి వస్తూ..బాపట్లలో రైలులో ఏడుస్తుండగా తోటి ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు బాలుడు శబరీష్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement