‘నల్లగొండ జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించడం దురదృష్టకరం. వాళ్ల కన్నతల్లే (కాంగ్రెస్ ప్రభుత్వం) సవతి తల్లి ప్రేమ చూపించింది.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీశ్రావు విసుర్లు
సాక్షి, హైదరాబాద్: ‘నల్లగొండ జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించడం దురదృష్టకరం. వాళ్ల కన్నతల్లే (కాంగ్రెస్ ప్రభుత్వం) సవతి తల్లి ప్రేమ చూపించింది. జిల్లా పట్ల సానుకూలంగా ఉన్నాం. ఫ్లోరైడ్ నిర్మూలనకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారు’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పనులపై ఆదివారం శాసనసభ స్వల్ప వ్యవధి ప్రశ్నల సమయంలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతి, స్థితిగతులను వివరించారు.
వర్షాలు కురిస్తే వచ్చే ఖరీఫ్లో లో లెవల్ కెనాల్ కింద 50 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేస్తామన్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల మంత్రులు జి.జగదీశ్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావుతో కలసి రెండురోజులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టమీద తిరిగి ఆధునికీకరణ పనులను పరిశీలించానన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 35 శాతం పనులే చేస్తే, తాము ఏడాదిలోనే 50 శాతం పనులు చేశామన్నారు. మిగిలిన పనిని ఈ ఏడాదిలోగా చేస్తామన్నారు. నీటి సంఘాల ప్యాకేజీ పనులకు గత ప్రభుత్వం టెండర్లు పిలవలేదని, తాము టెండర్లు పిలిచి అప్పుడే 65 శాతం పనులు చేశామన్నారు.