
బీరు తాగించి... అత్యాచారం
యువతికి బలవంతంగా బీరు తాగించి ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్లోని గాంధీనగర్ డివిజన్ పరిధిలో ఇళ్లల్లో పాచి పనులు చేస్తూ ఓ యువతి (18) నివసిస్తోంది.
యువతిపై ఇద్దరు ఆటోడ్రైవర్ల ఘాతుకం
హైదరాబాద్: యువతికి బలవంతంగా బీరు తాగించి ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్లోని గాంధీనగర్ డివిజన్ పరిధిలో ఇళ్లల్లో పాచి పనులు చేస్తూ ఓ యువతి (18) నివసిస్తోంది. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో మెహిదీపట్నంలో ఉంటున్న అక్క దగ్గరకు వెళ్లడానికి ఆటోలో బయలుదేరింది. వరుసకు బావయ్యే ఉస్మాన్(36), అతని స్నేహితుడు ఫీయూస్(28) ఆటోను అనుసరించి లోయర్ ట్యాంక్బండ్లోని కట్టమైసమ్మ ఆలయం వద్ద ఆపారు. యువతి తమకు బంధువని తాము ఆటోలో తీసుకెళ్తామని చెప్పి రూ.40 ఇచ్చి ఆమె వచ్చిన ఆటోను పంపించేశారు. ఆ యువతిని వీరి ఆటోలో ఎక్కించుకొని డీబీఆర్ మిల్లు సమీపంలో నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లారు. మార్గమధ్యలో యువతికి బలవంతంగా బీరు తాగించారు.
తాగిన మైకంలో ఉన్న ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత గాంధీనగర్ పరిధిలోని ఎల్ఐసీ బ్రిడ్జి సమీపంలోని ఫుట్పాత్పై వదిలిపెట్టి పరారయ్యారు. యువతి మెహిదీపట్నం చేరకపోవడంతో ఆందోళన చెందిన కుటుం బసభ్యులు వెతకడం ప్రారంభించారు. ఇంటికి సమీపంలోనే ఫుట్పాత్పైనే అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముషీరాబాద్ పోలీసులు యువతిని స్టేషన్కు తెచ్చి, ఆ తరువాత పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఉస్మాన్, ఫీయూస్ ఇద్దరూ ఆటో డ్రైవర్లే అని ఇన్స్పెక్టర్ మోహన్కుమార్ తెలిపారు.