'ఏపీ బ్రాండ్' కోసమే దావోస్ పర్యటన | Sakshi
Sakshi News home page

'ఏపీ బ్రాండ్' కోసమే దావోస్ పర్యటన

Published Mon, Jan 18 2016 1:44 PM

AP CM Chandrababu Naidu is all set to attend the World Economic Forum

హైదరాబాద్: స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో ఈ నెల 20 నుంచి 23 వ తేదీ వరకూ జరగనున్న 46 వ ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు అత్యున్నత అధికారుల బృందంతో సోమవారం సాయంత్రం బయలుదేరి వెళ్తారు. 24 న తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీ ప్రముఖులు పాల్గొంటారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ లు పలు ప్లీనరీ సదస్సుల్లో మాట్లాడనున్నారు.  
 
‘నాలుగో పారిశ్రామిక విప్లవం’ ప్రధానాంశంగా (theame) నిర్వహించే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఈ అంశంపై మరింత పరిజ్ఞానం సాధించి రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి బాటవేయటమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. 'ఏపీ బ్రాండ్' కోసం దావోస్ పర్యటన ఉపకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. బయోటెక్నాలజీ, రోబోటిక్స్ , త్రిడీ ప్రింటింగ్ వంటి శాస్ర్త సాంకేతిక అంశాలు, మానవుడిపై వాటి ప్రభావం తదితర విషయాలపై దావోస్ సదస్సులో చర్చలు ఉంటాయని పరకాల వెల్లడించారు. 
 
ఇలావుంటే సదస్సుకొచ్చే వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారుల్ని ఆకర్షిచేందుకు దావోస్ పర్యటన లో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. ‘మేక్ ఆంధ్రప్రదేశ్ యువర్ బిజినెస్’ పేరుతో రూపొందించిన ప్రచార రథం దావోస్ వీధుల్లో విహరిస్తూ సంచలనం సృష్టిస్తూ స్థానికులను ఆకర్షిస్తోంది. ఇందుకోసం వినూత్నంగా ఏర్పాటు చేసిన హోర్డింగులు దావోస్ నగరంలో ఆకర్షణగా నిలిచాయి.
 

Advertisement
Advertisement