ఆయన మంచితనాన్ని... చేతగాని తనంగా చూశారు! | today Director KSR Das jayanti | Sakshi
Sakshi News home page

ఆయన మంచితనాన్ని... చేతగాని తనంగా చూశారు!

Jan 5 2015 5:52 PM | Updated on Sep 2 2017 7:13 PM

ఆయన మంచితనాన్ని... చేతగాని తనంగా చూశారు!

ఆయన మంచితనాన్ని... చేతగాని తనంగా చూశారు!

కౌబాయ్, జేమ్స్ బాండ్ పాత్రల సృష్టికర్తగా కేఎస్‌ఆర్ దాస్ ప్రేక్షకలోకానికి చిరపరిచితులు.

కౌబాయ్, జేమ్స్ బాండ్ పాత్రల సృష్టిక ర్తగా  కేఎస్‌ఆర్ దాస్ ప్రేక్షకలోకానికి చిరపరిచితులు. ఆయన ద్వారా చిత్రపరిశ్రమకు పరిచయం అయిన ఎందరో నటులు సూపర్‌స్టార్లయ్యారు... సూపర్ హిట్ డెరైక్టర్‌గా... చేతికి ఎముకలేని మనిషిగా ఎంతో పేరు సంపాదించుకున్నా... ఆఖరి రోజుల్లో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడ్డారు దాసు. కేఎస్‌ఆర్ దాస్‌తో సుమారు అర్ధ శతాబ్దం పాటు అడుగులో అడుగులు వేసిన ఆయన సతీమణి శ్రీమతి నాగమణీదేవి, నేడు  దాస్ జయంతి సందర్భంగా, ఆయన జీవిత విశేషాలు సాక్షితో పంచుకున్నారు. ఆ విషయాలు ఆవిడ మాటల్లోనే...
 - డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై
 
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 1936లో పుట్టిన కొండా సుబ్బరామ్‌దాస్‌తో 1964లో నా వివాహం జరిగింది. మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు. 1966లో ఆయన ‘లోగుట్టు పెరుమాళ్లకెరుక’తో దర్శకత్వం ప్రారంభించారు. అక్కడి నుంచి మొత్తం 99 చిత్రాలు తీశారు. దర్శకత్వంలోకి రాక ముందు భావనారాయణ గారి దగ్గర ఎడిటింగ్ విభాగంలో పని చేశారు. స్పీడ్‌గా తీసే ఎడిటర్‌గా, గొప్ప డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఒక సందర్భంలో ఒక సంవత్సరంలో మొత్తం ఆరు సినిమాలు డెరైర్ట్ చేసిన ఘనత దాస్ గారిది. అందరితోనూ  ఆత్మీయంగా ఉండేవారు. విరివిగా దానధర్మాలు చేసేవారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి పంపేవారు. రజనీకాంత్, రాఘవేంద్రరావు, మోహన్‌బాబు, దాసరి, అట్లూరి పూర్ణచంద్ర రావు... వంటి వారితో మాకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. మరచిపోలేని రోజు... మా వారికి అనారోగ్యంగా ఉండటంతో ఆపరేషన్ కోసం 1988, మార్చిలో అమెరికా బయలుదేరాం. ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో తెలియదు కానీ, నా టికెట్ ఒకటే కన్‌ఫర్మ్ అయ్యింది, మా వారికి సీటు లేదు, దిగేయమన్నారు అధికారులు. అదే విమానంలో ప్రయాణించడానికి వచ్చిన ఒక వ్యక్తి, దాసు గారిని గుర్తు పట్టి, ‘మీరు దాసు గారే కదా. మీరు నా టికెట్‌తో ప్రయాణించండి... అని ఆయన సీటు మాకు ఇచ్చేశారు. నా జీవితంలో ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడ ఆయనకు ఆపరేషన్ జరిగింది. తరవాత ఇరవై ఏళ్లపాటు ఆరోగ్యంగానే ఉన్నారు. ఆ తరవాత మళ్లీ తిరగబెట్టింది.  
 
చివరి రోజుల్లో... ఆయన ఎప్పుడూ నాతో పాటు పూజలకు వచ్చేవారు కాదు. అయితే ఇంక రెండు సంవత్సరాల్లో పోతారనగా, ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. తన ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తిందనీ, బహుశ ఇంక ఎక్కువ రోజులు ఉండరనీ తెలిసే ఆయన అలా చేశారేమో అనిపిస్తుంది!
 
రెండు ఎదురుదెబ్బలు... మేం బెంగళూరు వచ్చాక కొన్ని ఆస్తులు సమకూర్చుకున్నాం కానీ, సినిమాలు తీసి అంతా పోగొట్టుకున్నాం. ఆయన అందరితోనూ మంచిగా ఉండేవారు. చాలామంది దాన్నే చేతగానితనంగా భావించారు. అవకాశాలు రాలేదని ఖాళీగా కూర్చోవడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. పోవడానికి ముందు... హైదరాబాద్ వెళ్లి మహేశ్‌బాబుని కాల్‌షీట్ అడిగారు.

అతను సరేనన్నాడు. అక్కడ నుంచి మద్రాసు వచ్చిన తర్వాత చిరంజీవి గారి అబ్బాయి పెళ్లికి బయలుదేరేముందు చెకప్‌కి వెళ్లాం. అయితే డాక్టరు వచ్చేలోగానే ఆయన కన్నుమూశారు. ఆ తర్వాత రెండేళ్లకే అంటే నాలుగు నెలల క్రితం ఆగస్టు 25 న మా అబ్బాయి కూడా పోయాడు. అలా నాకు రెండు దెబ్బలు తగిలాయి.
 
ఆస్తులు మిగల్చకపోయినా...
ఇప్పుడు నా వయసు 70. బెంగళూరులో మా అమ్మాయి దగ్గర రోజులు వెళ్లదీస్తున్నాను. మా వారు మాకు ఆస్తులు మిగల్చకపోయినా అప్పులు లేకుండా చేశారు... అది చాలు నాకు... అంటూ ముగించారు నాగమణీదేవి.                              
 
అవార్డు ఫంక్షన్‌కి పిలిచి...
డబ్బు లేకపోతే ఎవరూ గౌరవించరని అనుభవంలో తెలుసుకున్నాను. ఒక అవార్డుల ఫంక్షన్‌కి దాసుగారిని ఆహ్వానించారు. అయితే ఎక్కడో మూల కూర్చోబెట్టారు. వయసులో పెద్దవారు, అనారోగ్యంతో ఉన్నారని తెలిసి కూడా, రాత్రి పదకొండు దాకా మాట్లాడటానికి పిలవలేదు. ఆయన ఇంక అక్కడ ఉండలేక లేచి వచ్చేశారు. అలాగే, సైమా అవార్డుల ఫంక్షన్ జరిగినప్పుడు, పాత తరం డెరైక్టర్లందరి ఫోటోలు ఉంచారు. దాస్‌గారు దాదాపు వందసినిమాలకు దర్శకత్వం వహించినా, ఆయన ఫొటో ఒక్కటి కూడా లేకపోవడం చాలా బాధ వేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement