కంగారం.. కంగారం

Sakshi Family crime story special

ఓ బంగారం వ్యాపారిఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఓ నల్లరంగు బ్యాగుఓ పోలీసాయన పెళ్లిరోజుఓ చికుబుక్‌ చికుబుక్‌ రైలు కోపంతో మండిపడిన ఎస్పీభయంతో బిగుసుకుపోయిన ఎస్సైమధ్యలో చాయ్‌వాలాఅంతా కంగారం.. కంగారం..

మార్చి, 2013
అది ఖమ్మం జిల్లా రైల్వేపోలీస్‌ స్టేషన్‌. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రవిరాజ్‌ గోడ గడియారం కేసి పదేపదే చూస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు ఉగాది పండగ. పైగా తన పెళ్లిరోజు. రెండు పండుగలు కలిసి వచ్చాయి. కనీసం ఈసారైనా పెళ్లిరోజు తన భార్యతో కలిసి జరుపుకోవాలని ఏడాది నుంచి ప్లాన్‌ చేస్తున్నాడు. ముందురోజు రాత్రంతా నైట్‌ డ్యూటీ చేసాడు. ఉదయం అయింది. ఇక హ్యాపీగా ఇంటికి వెళదామని సిద్ధమవుతున్నాడు రవిరాజ్‌..అపుడే బాయ్‌ ఛాయ్‌ తెచ్చి ఇచ్చాడు. చాయ్‌ వాసన తగలగానే రవిరాజ్‌కి నిద్రమత్తు దిగినట్లయింది. పొగలు కక్కుతున్న టీని ఒక్క గుటక మింగాడో లేదో అంతే.. ఓ నడివయస్కుడు.. ‘సార్‌ ..!’ అంటూ వచ్చాడు. అతని కాళ్లు, చేతులు వణుకుతున్నాయ్‌! ఖద్దరు దుస్తులు, ఒంటిమీద బంగారు ఆభరణాలు, చేతిలో ఐఫోన్‌... చూస్తుంటే బాగా డబ్బున్న వ్యక్తిలాగే ఉన్నాడు.ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు కానీ, ఏదీ చెప్పలేకపోతున్నాడు. కానిస్టేబుల్‌ 302 వైపు చూశాడు రవి.. వెంటనే గ్లాసుతో మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు 302.ఆ పెద్దమనిషి నీళ్లు తాగి కాస్త స్థిమిత పడ్డట్టు అనిపించగానే ‘ఇపుడు చెప్పండి ఏం జరిగింది?’ అన్నాడు.‘నా బ్యాగులో ఉన్న 3 కిలోల బంగారం పోయింది సార్‌!’ అన్నాడు ఆ వ్యక్తి.

కుర్చీలో వాలుగా కూర్చున్న రవిరాజ్‌ ఒక్కసారిగా అదిరిపడ్డాడు. అది విన్న మిగిలిన పోలీసులు, ఛాయ్‌వాలా అంతా అతనివైపు తిరిగారు.‘‘మీ దగ్గర అంత బంగారం ఎందుకుంది? అసలు మీరెవరు?’’ అడిగాడు అనుమానంగా!‘సార్‌.. నా పేరు నట్వర్‌లాల్‌.. మాకు ఖమ్మంలో ఓ జ్యువెల్లరీ షాపు ఉంది. మేం తరచు గుంటూరు నుంచి బంగారం తీసుకొస్తాం. మాకిది అలవాటే.. ఎపుడూ లేనిది ఇప్పుడే ఇలా జరిగింది. బ్యాగు బ్యాగులాగే ఉంది. కానీ అందులో బంగారం లేదు’ అంటూ బ్యాగ్‌ కేసి చూపించాడు.తలపట్టుకున్నాడు రవిరాజ్‌. ఈసారి కూడా పెళ్లిరోజుకు ఇంటికి వెళ్లలేనని తెలిసిపోయింది.‘సరే! మీరు రైలెక్కిన దగ్గర నుంచి ఏం జరిగిందో వివరంగా చెప్పగలరా?’ అడిగాడు.‘నాతోపాటు విజయవాడలో ఓ కాలేజీ కుర్రాడు రైలెక్కినట్లు గుర్తుంది సార్‌..’ సమాధానమిచ్చాడతను. అతను చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు రవిరాజ్‌. అతను చెప్పిందంతా ఉన్నతాధికారులకు ఇన్‌ఫామ్‌ చేద్దామని మనసులో అనుకుంటుండగానే...సెల్‌ మోగింది. పేరు చూడగానే అటెన్షన్లోకొచ్చి ‘సార్‌! గుడ్‌మార్నింగ్‌ సార్‌’’ అన్నాడు వినయంగా.  ‘ఆ వ్యక్తి వీవీఐపీ.. కేసును ఫాలో అప్‌ చేయమని పైనుంచి స్పెషల్‌ ఆర్డర్స్‌ వచ్చాయి.. నేనూ వస్తున్నాను.. మరో పది నిమిషాల్లో ఖమ్మం బయల్దేరుతాను. నేను జీపు దిగేలోపు దొంగ దొరకాలి’. ఆర్డర్‌ వేశాడు ఎస్పీ.ఇన్వెస్టిగేషన్‌ స్టార్ట్‌ చేశాడు రవి. గుంటూరు నుంచి అన్ని రైల్వేస్టేషన్ల సీసీ కెమెరాల ఫుటేజీలనూ తెప్పించుకుని నిశితంగా పరిశీలించాడు. ఎవరూ అనుమానంగా కనిపించలేదు. బాధితుడు చెబుతున్న దాన్ని బట్టి.. మూడుకిలోల బంగారం తీసుకొచ్చే వ్యక్తి ఏమరుపాటుగా ఉండడు. కానీ బ్యాగులోని బంగారం ఎలా మాయమైంది? అన్న ప్రశ్న రవి బుర్రను తొలిచేస్తోంది. రవి బుర్రలో ఓ ఫ్లాష్‌ 
 

బాధితుడిని పిలిచాడు రవిరాజ్‌.. ‘‘మీరు బ్యాగులో బంగారంతోపాటు ఏమేం తెచ్చారు?’’ అనడిగాడు.  ‘‘బంగారం బిస్కెట్లు, వాటి బిల్లులు, ఇంకా కొన్ని గాజులు తెచ్చాను సార్‌’’ ‘‘ఓసారి మీ బ్యాగు చూపిస్తారా?’’ అన్నాడు. ‘‘చూడండి’’ అన్నట్లుగా బ్యాగును అందించాడు. అందులో బిల్లులు ఏమీ లేవు. బదులుగా ఏవో కాంపిటీటివ్‌ పుస్తకాలు ఉన్నాయి.అది చూసేసరికి– ఇది దొంగతనం కాకపోవచ్చు.బహుశా బ్యాగు మారి ఉంటుంది... అని అనుమానం వచ్చింది ఎస్‌.ఐకి. ఆ పుస్తకాలపై పేరూ ఊరూ ఏమీ లేదు. కొత్తగా ఉన్నాయి. ఆ బ్యాగు ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థిది అని అర్థం అవుతోంది కానీ ఆ విద్యార్థి ఎవరు? సాలోచనగా ఆ పుస్తకాలను తిరగేస్తుండగా అందులో నుంచి ఏదో కాగితం ముక్క జారి పడింది.

రెండు నెలల క్రితం జరిగిన ఓ ఇంజినీరింగ్‌ ఫెస్ట్‌కు సంబంధించిన వాలంటీర్‌ ఐడీ కార్డు అది. దానిపై ‘324’ అనే నెంబరు ఉంది. అంతకుమించి ఎలాంటి వివరాలూ లేవు. ఆ కాగితం ముక్కే ఇపుడు కీలకం! విజయవాడలోని ఇంజినీరింగ్‌ కాలేజీలన్నీ కలిసి జనవరిలో ఆ ఫెస్ట్‌ నిర్వహించినట్లు గుర్తు. దాని నిర్వాహకులకు ఫోన్‌ చేశాడు ఎస్సై. కేసు తీవ్రత గురించి వివరించి రిక్వెస్ట్‌ చేయడంతో  ఆ వివరాలన్నీ మెయిల్‌ చేశారు వాళ్లు. మెయిల్‌ ప్రింటవుట్‌ తీసుకున్న రవిరాజ్‌కు ఆ విద్యార్థి ఇంజినీరింగ్‌ చేసే 21 ఏళ్ల అబ్బాయి అని, అదీ ఖమ్మం వాడేనని తెలిసింది. వెంటనే బాధితుడితోబాటు కానిస్టేబుల్‌ను కూడా తీసుకుని జీపులో  బయల్దేరాడు రవి రాజ్‌. టౌన్‌లోని ఓ బస్టాప్‌ వద్ద జీపు ఆగింది. అక్కడే ఉండే పాన్‌షాప్‌ ఓనర్‌ కమ్‌ పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ని పిలిపించారు. అతను వచ్చి ‘ఏంటిసార్‌ విషయం..’ అని అడిగాడు. 
‘గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ జరిగింది. దొంగ ఇక్కడే ఉన్నాడు. నువ్వు సాయం చేస్తే దొంగ దొరికినట్లే’ అంటూ చెప్పాడు రవిరాజ్‌.
 

భోజనాలు అయ్యాక పుస్తకాలు తీద్దామనుకున్న అర్జున్‌కి  కళ్లు బైర్లు కమ్మాయి. తన బ్యాగులో బంగారం బిస్కెట్లు.. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. వెంటనే ‘నాన్నా!’ అంటూ కేకలేశాడు. పరుగున వచ్చిన రామారావు కొడుకు చేతిలో బంగారం బిస్కెట్లు చూసి అవాక్కయ్యాడు. ‘ఏరా..! చదువుకోమని కాలేజీకి పంపిస్తే.. నువ్వు చేసే నిర్వాకం ఇదా?’ కొడుకేదో చేయకూడని పని చేసుంటాడనే అనుమానంతో  అరిచాడు. ‘లేదు నాన్నా! అసలిది నా బ్యాగే కాదు. కావాలంటే చూడు. నేను విజయవాడలో కొన్న పుస్తకాలకు బదులుగా ఇందులో బంగారం ఉంది..’ అంటూ జరిగిన విషయం చెప్పాడు. రామారావు భార్య పద్మ వెంటనే ‘పోలీసులకు చెబుదామండీ...’’ అంది. ‘‘మనం నిజం చెప్పినా పోలీసులు నమ్ముతారా? వీడిని దొంగ అనుకుని లోపలేస్తారు.. ’’ మనసులోని భయాన్ని వెళ్లగక్కాడు రామారావు. తండ్రి మాటలు అర్జున్‌ను మరింత భయపెట్టాయి. ఇంతలోనే బయట తలుపుకొట్టిన చప్పుడు అవడంతో ఎవరై ఉంటారా అన్న అనుమానంతో అంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
 

ధైర్యం చేసిన రామారావు నెమ్మదిగా తలుపు తీశాడు. వచ్చిన వ్యక్తి వైపు అనుమానంగా చూసి ‘ఎవర్నువ్వు? ఏం కావాలి?’ అడిగాడు. ‘సార్, నేను వీధి చివరన ఉండే పాన్‌షాప్‌ ఓనర్‌ని సార్‌. గుర్తుపట్టలేదా?’ అంటూనే చనువుగాలోపలికి వచ్చాడు.. ‘సార్‌! ఈ విషయం పోలీసులకు తెలిసిపోయింది’ అన్నాడు.‘పోలీసులు’ అన్న మాట వినగానే.. రామారావు గుండెలు జారిపోయాయి.వెంటనే అతని చేతులు పట్టుకున్నాడు.‘అయ్యో.. పెద్దవారు మీరు కావాలని చేయలేదు. జరిగిందంతా ఎస్‌ఐ గారికి తెలుసు.. కాకపోతే మీతో ఆయన మాట్లాడుతాడట’ అన్నాడు. ‘సరే పిలవండి’ అన్నాడుతడి ఆరిన గొంతుతో రామారావు.షాప్‌ ఓనర్‌ సిగ్నల్‌ ఇవ్వగానే పోలీసులు ఇంట్లోకి దూసుకొచ్చారు.అతని బేల ముఖం చూస్తూనే ఎస్‌.ఐ ‘జరిగింది పొరబాటే.. దొంగతనం కాదని మాకర్థమైంది. మీ అబ్బాయిని పిలవండి ఓసారి’ అన్నాడు.లోపలి నుంచి ఆ మాటలు వింటున్న అర్జున్‌  బ్యాగు పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గదిలో నుంచి బయటికి వచ్చి తలదించుకుని నిలబడ్డాడు. ‘‘మీది మంచికుటుంబం కాబట్టిపోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్నారు. ఇంకెవరైనా అయి ఉంటే.. దీన్ని ఎలా మాయం చేద్దామా అని ఆలోచించేవారు’’ అంటూనే ఎస్‌.ఐ బ్యాగు తీసుకుని బయటి వచ్చేశాడు.జీపులో కూర్చున్న బంగారం వ్యాపారి ప్రాణాలు లేచి వచ్చాయి. పరుగున వచ్చి ఎస్‌.ఐకి కృతజ్ఞతలు తెలిపాడు. ఈలోపు దారిలో ఉన్న ఎస్పీకి ఫోన్‌ ద్వారా ఇన్‌ఫర్మేషన్‌ ఇచ్చాడు రవిరాజ్‌. తీరా తన పర్సనల్‌ఫోన్‌ చూస్తే ఇంటి నుంచి 170 మిస్‌డ్‌ కాల్స్‌.

ఎస్పీ వచ్చేసరికి సాయంకాలమైంది. కెమెరా ఫ్లాష్‌లతో ప్రెస్‌మీట్‌ ప్రాంగణమంతా మెరిసిపోతోంది. నిద్రలేకుండా పీక్కుకుపోయిన ముఖంతో ఉన్న రవిరాజ్‌ ఓపికగా నిలుచున్నాడు. అపుడు ఎస్పీ అసలేం జరిగిందో చెప్పాడు. అది విని ఇంతేనా అంటూ నిట్టూర్చారు మీడియా జర్నలిస్టులు. కానీ, కేసును గంటల వ్యవధిలోనే ఓ చిన్న క్లూతో ఛేదించిన పోలీసుల తెలివితేటలను అంతా అభినందించారు.అసలేం జరిగిందంటే..బంగారంతో రైలెక్కిన వ్యాపారి విజయవాడ వరకు నిద్రపోలేదు. కిటికీ పక్కనే కూర్చుని ఫోన్‌  మాట్లాడాడు. విజయవాడ దాటిన తరువాత చల్లగాలికి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అపుడే విజయవాడలో రైలెక్కాడు ఖమ్మంకు చెందిన ఓ ఇంజినీరింగ్‌ కుర్రాడు. ఆ అబ్బాయి కూడా నిద్రపోయాడు. కానీ, ఖమ్మం రాగానే నిద్రమత్తుతో బ్యాగు భుజానకేసుకుని దిగి ఇంటికెళ్లాడు. రైలు కదిలే సమయానికి నిద్రలేచిన బంగారం వ్యాపారి బ్యాగు బరువులో తేడా ఉండటంతో తెరిచి చూసి గుండెలు బాదుకున్నాడు. అదీ జరిగింది. ఇద్దరివీ ఒకే కంపెనీ, ఒకే రంగు బ్యాగులు కావడంతో పొరబాటున ఆ ఇంజినీరింగ్‌ విద్యార్థి తనదనకుని వ్యాపారి బ్యాగు తీసుకెళ్లాడు. అదన్నమాట సంగతి. కానీ, అందులో దొరికిన ఫెస్ట్‌ వాలంటీర్‌ కార్డు కేసు చిక్కుముడి విప్పేందుకు కీలకమైన క్లూగా నిలిచింది.అక్కడే వ్యాపారి పోలీసులందరికీ రివార్డు ప్రకటించాడు. ఎస్పీ తిరిగి హైదరాబాద్‌ వెళ్లేదాకా అక్కడే వెయిట్‌ చేశాడు రవిరాజ్‌. తీరా ఇంటికెళ్లేసరికి రాత్రి 12 అయింది. భయం..భయంగా ఇంటి మెట్లెక్కుతూ వణుకుతున్న చేతులతో కాలింగ్‌ బెల్‌ నొక్కాడు.
 – అనిల్‌కుమార్‌ భాషబోయిన 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top