
ఎండ మండుతున్నా..!
నడిరోడ్డు మీద వేదిక.. ఓ పక్క ఎండ మండుతోంది.. మరో పక్క అధినేత రాక ఆలస్యమైంది.
అనంతపురం టౌన్ : నడిరోడ్డు మీద వేదిక.. ఓ పక్క ఎండ మండుతోంది.. మరో పక్క అధినేత రాక ఆలస్యమైంది. అయినా ఎంతో ఓపికతో మహిళలు ఎదురుచూశారు. అలసటనేదే లేదు.. రాజన్న ముద్దుబిడ్డను చూడగానే సంతోషంతో మురిసిపోయారు. రైతు సమస్యలపై మంగళవారం ‘అనంత’ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన మహాధర్నాకు వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి జగన్కు జేజేలు పలికారు.
• బెంగళూరు నుంచి బయలుదేరిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 10 గంటలకు బాగేపల్లి టోల్గేట్ వద్దకు చేరుకోగానే పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
• ఉదయం 10 గంటలకే అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వేలాదిగా జనం తరలివచ్చారు.
• 11.35 గంటలకు వైఎస్ జగన్ వేదిక మీదకు వచ్చారు.
• అప్పటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి రోడ్డుమీదే కూర్చుండిపోయారు.
• నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు జెండాలతో తరలివచ్చారు.
• వేదిక ముందు కనుచూపు మేర జనం కన్పించగా.. వేదిక వెనుక భాగంలో హిందూపురం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు, రైతులు ఉండిపోవాల్సి వచ్చింది.
• వైఎస్ జగన్మోహన్రెడ్డి 42 నిమిషాల పాటు ప్రసంగించగా, అందరూ ఎంతో ఆసక్తిగా విన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ అయ్యాయా.. లేదా అంటూ జనంతోనే చేతులెత్తించి సమాధానం రాబట్టారు.
• కరువు తెలుసుకునేందుకు ఏరియల్ సర్వే చేసిన ఘనత చంద్రబాబుదేనని జగన్ ఎద్దేవా చేయగానే జనం కేరింతలు కొట్టారు.
• ధర్నా ముగియగానే జగన్తో పాటు పార్టీ నేతలు కలెక్టర్ శశిధర్ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్లోకి వెళ్లారు. ఈ సమయంలో సిబ్బంది, జర్నలిస్టులు జగన్తో సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
• చివరగా వైఎస్ జగన్ కొత్తూరు అమ్మవారి శాలకు వచ్చి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు సెల్ఫీలు దిగారు.
• ఆ తర్వాత పులివెందులకు వెళ్లిపోయారు.