
సమగ్ర అధ్యయనం లేకుండానే పర్యావరణ అనుమతులు
రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ, నిపుణుల అధ్యయన కమిటీ సమగ్ర అధ్యయనం జరపకుండానే ఆంధ్రప్రదేశ్
‘అమరావతి’ నిర్మాణంపై ఎన్జీటీలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ, నిపుణుల అధ్యయన కమిటీ సమగ్ర అధ్యయనం జరపకుండానే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేశాయని జాతీయ హరిత ట్రిబ్యునల్లో అమరావతి నిర్మాణంపై జరుగుతున్న విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అమరావతి నిర్మాణానికి మంజూరైన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్న్ను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం కూడా విచారించింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది రిత్విక్ దత్తా వాదనలు వినిపిస్తూ.. పర్యావరణ అనుమతులు మంజూరు చేసేటప్పుడు ‘సమగ్ర అధ్యయనం’ అవసరం అని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి నిపుణుల అంచనా కమిటీ, రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ.. ఎలాంటి అధ్యయనం చేయకుండా ఒకే రోజు 75 అనుమతులు మంజూరు చేశాయని దత్తా వివరించారు. ఈ క్రమంలో ధర్మాసనం కల్పించుకొని ‘అధ్యయన కమిటీలు లేవనెత్తిన లోపాలు ఏంటి? వాటికి ఏ విధంగా సంజాయిషీ ఇచ్చారో వివరాలు సమర్పించండి’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.