
గిరిజన రైతులకు అండగా ఉంటాం
రాచకొండ ప్రాంతంలోని గిరిజన రైతులకు జేఏసీ అండగా ఉంటుందని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటూ సాగు చేసుకుంటున్న భూములకు న్యాయపరంగా పట్టాలు పొందారని, వాటిని రద్దు చేయాలని చూస్తే చర్చల ద్వారా పరిష్కరించుకుందాం..
–కాకపోతే తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్నదంతా చూపిద్దాం
–జేఏసీ చైర్మన్ కోదండరాం
సంస్థాన్ నారాయణపురం: రాచకొండ ప్రాంతంలోని గిరిజన రైతులకు జేఏసీ అండగా ఉంటుందని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటూ సాగు చేసుకుంటున్న భూములకు న్యాయపరంగా పట్టాలు పొందారని, వాటిని రద్దు చేయాలని చూస్తే చర్చల ద్వారా పరిష్కరించుకుందాం.. అయినా పరిష్కారం కాకపోతే తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్నదంతా చూపిద్దామన్నారు. ఆఖిలపక్ష రాజకీయ పార్టీలు, విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రాచకొండలోని రైతుల సమస్యలను తెలుసుకోవడానికి చేపట్టిన రాచకొండ గిరిజన భూగోస అధ్యయన యాత్రలో భాగంగా గురువారం రాచకొండ అటవీ ప్రాంతంలోని శివాలయం వద్ద జరిగిన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాచకొండలోని 273, 192, 106 సర్వే నంబర్ ప్రభుత్వ భూముల్లో చాలా మంది రైతులం సేద్యం చేసుకుంటున్నామని, పట్టాదారు పాసు పుస్తకాలు, ఆన్లైన్ పహాణీలు కూడా వచ్చాయని, రుణాలు కూడా పొందినట్లు పలువురు తెలిపారు. కానీ ఇటీవల ఆన్లైన్ పహాణీ రుణాలు రెన్యూవల్ చేయడం లేదని, రుణమాఫీ పథకం వర్తించడం లేదని, ఇన్ఫుట్ సబ్సిడీ, పంటల బీమా పథకం వర్తించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. రాచకొండ ప్రాంత రైతులు కష్టపడుతూ సాదాసీదా జీవనం సాగిస్తున్నారని, ఇక్కడ ఫిలింసిటీ లేదా మరే అభివృద్ధి పనులు చేపట్టినా సంతోషించేవారని పేర్కొన్నారు. ప్రభుత్వం వీరి ఆవేదన అర్థం చేసుకొని రుణమాఫీ, ఇనుఫుట్ సబ్సిడీ చెల్లించాలని, బీమా తదితర పథకాలు వర్తింపజేయాలన్నారు. రైతుల సమస్యపై తొలుత కలెక్టర్, ఎమ్మెల్యే, రాష్ట్ర అధికారులకు వినతులు అందజేస్తామని, పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష కార్యచరణ చేపడతామని పేర్కొన్నారు. రైతులకు జేఏసీ అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల జేఏసీ అధ్యక్షులు ధర్మ అర్జున్, చల్మారెడ్డి, అఖిలపక్ష నాయకులు పీఏసీఎస్ చైర్మన్ గడ్డం మురళీధర్రెడ్డి, ఉజ్జిణి యాదగిరిరావు, జక్కలి ఐలయ్య, ఎంపీపీ వాంకుడోతు బుజ్జి, వెలిజాల రాంచెంద్రం, రహీం షరీఫ్, బైకని నరేందర్, దోనూరి వీరారెడ్డి,కుందారపు యాదయ్య, కురుమిద్దె లింగయ్య, శ్రీనివాసాచారి, పానుగోతు సుజాత, కాట్రోతు సాగర్, ఏర్పుల సుదర్శన్, పందుల సైదులు
తదితరులు పాల్గొన్నారు.
ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నాం
–కస్నానాయక్, పటేల్చెర్వుతండా
1940కి ముందునుంచి మా ముత్తాత కాలం నుంచి భూమిని సాగు చేసుకుంటున్నాం. ఫీల్డ్ఫైరింగ్ రేంజ్, బీడీఎల్ అంటూ అధికారులు వస్తే అడ్డుకున్నాం. ఇప్పుడేమో ఆన్లైన్ పహాణీలు రావడం లేదు. న్యాయం జరిగేలా చూడాలన్నారు.
వైఎస్ పట్టాలిస్తే ఇప్పుడు హక్కు లేదంటుండ్రు
–లచ్చు, రైతు, ఐదు దోనాల తండా
ఎన్నో సంవత్సరాలుగా భూములు సాగు చేసుకుంటున్న మాకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాకు అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు, పాస్ పుస్తకాలిచ్చారు. అటవీశాఖ అధికారులేమో మీకు భూమి లేదంటున్నారు. రెండేళ్ల నుంచి ఉపాధి పనులు కూడా నిర్వహించడం లేదు. ఇలా మరెందరో రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.