
ఆకులందు అణిగిమణిగి ఉండే అడవి పాటను భళ్లుమనే దీపాల నగర వేదికల మీదకు తెచ్చింది మాహి. మహరాష్ట్ర ఆదివాసీ తెగకు చెందిన ఈ యువ గాయని తన రాప్ సింగింగ్ని పేరు కోసమో కీర్తి కోసమో కాక అడవి కోసం, పర్యావరణం కోసం ఆయుధంగా మార్చింది. మాహి చెప్పేది ఒకటే – దేశంలో ఎవరు ఎక్కడ ఉండాలో కొందరు నిర్ణయించారు. ఎక్కడకు చేరాలో మనం నిశ్చయించుకుంటే చాలు అని. మాఝీ నిర్ణయం ప్రకారం ఆమె పాట సరిహద్దులు దాటుతోంది.
‘నేను మీకు వినోదం అందించడానికి రాలేదు. నా జాతికి ప్రాతినిధ్యం వహించడానికి వచ్చాను’ అంటుంది మాహి. 27 ఏళ్ల ఈ ర్యాప్ సింగర్ ఆదివాసీల జీవితాన్నే పాటగా మార్చి లైవ్ షోస్ చేస్తూ ఆదరణ పొందుతోంది. ఎడతెగని వచనాన్ని పాటలా పాడే ‘ర్యాప్’ లో మన దేశం నుంచి మురికివాడల పిల్లలు కూడా షైన్ అయ్యి పేరు సంపాదించారు. ఇప్పుడు అడవి నుంచి వచ్చిన మాహి వంతు. ‘మా ఆదివాసీల గురించి నేను పాడకపోతే ఇంకెవరు పాడతారు’ అంటుంది మాహి.
గిరిజన కోయిల
మాహి పూర్తి పేరు మధుర యశ్వంత్ ఘనె. అయితే ర్యాపర్గా మాహి.జి పేరుతో గుర్తింపు పొందింది. ఈమె సొంత ఊరు మహరాష్ట్రలోని వరంగుషి. వీళ్లంది మహదేవ్ కోలి అనే గిరిజన తెగ. తండ్రి బస్ కండెక్టర్గా పని చేస్తుంటే తల్లి గృహిణి. ‘మా తెగలో ఎవరూ బడికి వెళ్లరు.
వెళ్లినా మధ్యలోనే మానేస్తారు. అందుకే మా అమ్మా నాన్నా నా చదువు కోసం ముంబై వలస వచ్చారు’ అంటుంది మాహి. ముంబైలో తమ్ముడితో కలిసి ఇంజనీరింగ్లో చేరిన మాహి అక్కడే స్టూడెంట్స్ పాడే ర్యాప్ సాంగ్స్ను మొదటిసారి వింది. అయితే ఆమెకు పాడటం రాదు, బాణీ కట్టడం అంతకన్నా రాదు. కాని అప్పుడప్పుడు కవిత్వం రాసేది. కాని కోవిడ్ వచ్చాక ఆమెలోకి గాయని బయటకు వచ్చింది.
అడవి పాట ఇచ్చింది
కోవిడ్ వచ్చినప్పుడు ముంబై మూగబోయింది. ఆ సమయంలో నగరం మంచిది కాదని మాహి కుటుంబం అడవిలోని సొంత పల్లెకు వెళ్లి ఉండిపోయింది. ‘అక్కడకు వెళ్లాక మా వాళ్ల జీవితం నాకు కొత్తగా అర్థమైంది. వారు కోవిడ్ కాలంలో కూడా హాయిగా జీవిస్తున్నారు. వారు ప్రకృతి ఒడిలో ఉన్నారు. ఆశ లేదు. పరుగు లేదు. ఎవరికీ హాని చేయరు. అడవిని కాపాడి మేలు చేస్తారు. కాని వీరి గురించి ఎవరూ మాట్లాడరే. అడవుల్లో గిరిజనులు ఉన్న ఊసే ఎవరికీ ఉండదే అనిపించింది. అలా మొదటి పాట తన్నుకొని వచ్చింది. ఆ పాటే ‘జంగిల్ చా రాజా’. 2019లో ఈ పాట బయటకు రాగానే నాకు గుర్తింపు వచ్చింది’ అంటుంది మాహి.
హక్కుల కోసం పాట
మాహి తన పాటలో సామాజిక స్పృహ ఉండాలని కోరుకోవడం ఆమెకు గౌరవాన్ని తెచ్చింది. జేఎన్యూ స్టూడెంట్స్ ప్రత్యేకంగా ఆహ్వానించి మాహి షో నిర్వహించడంతో మాహి పాటల్లోని రాజకీయ స్పృహ మరింతగా పదును తేలింది. ఇక మాహి పాటలు వరుసెత్తాయి. రైతుల సమస్యలు, కుల వివక్ష, క్వీర్ కమ్యూనిటీ హక్కులు, గ్రామీణ జీవనం, స్త్రీల సంఘర్షణ ఆమె సాట వస్తువులయ్యాయి.
‘కనిపించే వాటిని చూస్తూ కూడా అంధుడిగా మారకు’... ‘ఎవరి చెమటతో నీ ఇల్లు పూర్తవుతుందో వారు ఏ ఠికానా లేకుండా తిరగడాన్ని చూడు’... ‘బేటీ బచావు కబ్ తక్... ఎందుకు ఆడపిల్లను కాపాడాలి... కాపాడాల్సిన అవసరమే లేని సమాజాన్ని నిర్మించలేమా’... ఇలా ఉంటాయి ఆమె పాటల్లోని లైన్లు.మాహి ఇంకా చాలా పేరునూ గుర్తింపునూ పొంనుంది. ఎందుకంటే ఆమె పాటలో అర్థం, ఆగ్రహం ఉన్నాయి. అవి పాటను సజీవం చేస్తాయి.
(చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..)