కారుబోల్తా.. ఇద్దరు మృతి
ఒక కేసు విచారణ నిమిత్తం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
కేసు విచారణకు వెళ్తూ..మృత్యు ఒడికి
- మరో ఇద్దరికి గాయాలు
డోన్ టౌన్: ఒక కేసు విచారణ నిమిత్తం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన డోన్ మండలం ఓబులాపురం మెట్టవద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం 6గంటలకు చోటు చేసుకుంది. బెంగళూరు హెచ్సీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేసు విచారణ నిమిత్తం ఫిర్యాదు దారుడు జయన్నతో పాటు కానిస్టేబుల్ సురేష్ను వెంట తీసుకొని ఎస్ఐ శ్రీనివాసులు.. కేఏ 53పీ 9799 అనే ఇన్నోవా వాహనంలో హైదరాబాద్కు వెళ్తున్నారు. డ్రైవర్ మంజునాథ్ నిద్రమత్తు కారణంగా, అత్యంత వేగంతో కారు నడపడంతో ఓబులాపురం వద్ద ప్రమాద సూచిక రాళ్లను ఢీకొట్టి అది బోల్తాపడింది. ప్రమాదంలో కానిస్టేబుల్ సురేష్ (29), జయన్న (28) అక్కడిక్కకడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఎస్ఐ శ్రీనివాసులు , కారు డ్రైవర్ మంజునాథ్ను చికిత్స నిమిత్తం డోన్ ప్రజావైద్యశాలకు తరలించారు.
విషయం తెలిసిన వెంటనే డోన్ రూరల్ ఎస్ఐ రామసుబ్బయ్య ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించి వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల బంధువులకు కూడా సమాచారం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని సీఐ శ్రీనివాసులు గౌడ్ పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల్లో కానిస్టేబుల్ అవివాహితుడు కాగా జయన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డోన్ రూరల్ ఎస్ఐ రామసుబ్బయ్య తెలిపారు.