మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర రైల్వే గేటు వద్ద కొనసాగుతున్న ఆర్వోబీ పనులతో మంగళవారం రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
దేవరకద్ర(మహబూబ్నగర్): మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర రైల్వే గేటు వద్ద కొనసాగుతున్న ఆర్వోబీ పనులతో మంగళవారం రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. క్రేన్లు తిరగడానికి తరచూ గేటు వేయడం వల్ల అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. గత ఆరు నెలలుగా ఇక్కడ ఆర్వోబీ పనులు కొనసాగుతున్నాయి. ట్రాక్కు రెండు వైపులా పిల్లర్ల నిర్మాణం పూర్తి కావడంతో వాటిపైకి ఇనుప దిమ్మెలను చేర్చడానికి భారీ క్రేన్లను రప్పించారు. వాటిని గేటు మధ్యలో ట్రాక్పై నిలపడంత్లో రైళ్ల రాకపోకలను నాలుగు గంటల పాటు ఆపేశారు.
కర్నూలు, కాచిగూడల వైపు వెళ్లే రైళ్లను మధ్యాహ్నం 12 గంటల నుంచి పూర్తిగా నిలిపి వేశారు. అలాగే, గంట పాటు గేటు వేసి క్రేన్లతో స్టీల్ దిమ్మెలను పిల్లర్ల పైకి చేర్చారు. తరువాత ట్రాఫిక్ను మధ్య మధ్యలో క్లియర్ చేస్త్తూ పనులు కొనసాగించారు. సాయంత్రం 4 గంటల వరకు పనులు కొనసాగాయి. తరువాత రైళ్ల రాక పోకలను కొనసాగించారు. ఆర్వోబీ పనుల సందర్భంగా గేటును మధ్య మధ్యలో గంట, అరగంట వేయడం వల్ల ట్రాఫిక్ నిలిచి పోయింది. పనులు జరుగుతున్న సమయంలో పోలీసు బందోబస్తు చేశారు. అలాగే, గేటు దగ్గరకు వాహనాలు రాకుండా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు.