ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తే ఖాతాలో నగదు మాయం | the phone lifts, the cash in the account switches | Sakshi
Sakshi News home page

ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తే ఖాతాలో నగదు మాయం

Jun 22 2017 1:56 AM | Updated on Sep 5 2017 2:08 PM

ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తే ఖాతాలో నగదు మాయం

ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తే ఖాతాలో నగదు మాయం

కాణిపాకం వాసులకు పది రోజులుగా కంటి మీద కునుకులేకుండా పోతోంది.

కాణిపాకం ఉద్యోగులే టార్గెట్‌
వారం రోజుల్లో పది మంది బాధితులు


కాణిపాకం: కాణిపాకం వాసులకు పది రోజులుగా కంటి మీద కునుకులేకుండా పోతోంది. ఆలయ ఉద్యోగులే టార్గెట్‌గా అనామక వ్యక్తులు ఫోన్‌ చేస్తున్నారు. ఆ ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే వారి బ్యాంకు అకౌంట్‌లో నగదు మాయమైపోతోంది. ఇలా వారం రోజుల్లో దాదాపు పది మంది నగదు కోల్పోయారు. దేవస్థానం వద్ద పోలీసు స్టేషన్‌లో పనిచేసే ఒక అధికారికి ఇటీవల ఓ నంబరు నుంచి ఫోను వచ్చింది. ‘మేము ఎస్‌బీఐ నుంచి మాట్లాడుతున్నాము.. మీ అకౌంట్‌ నంబరు నిలిపివేయబడింది. పునరుద్ధరించుకోండి’ అంటూ అవతలి వ్యక్తి చెప్పారు. అకౌంట్‌ నంబర్‌.. ఏటీఎం నంబర్‌ చెప్పాల్సిందిగా కోరాడు.

వివరాలు చెప్పిన కొద్ది సేపటికే ఆయన అకౌంట్‌ నుంచి డబ్బు వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. అదేవిధంగా దేవస్థానంలోని శివాలయంలో పనిచేసే ఓ ప్రధాన అర్చకుడికి ఫోను వచ్చింది. పై వివరాలన్నీ చెప్పడంతో కొద్ది క్షణాల్లోనే రూ.30 వేలు అకౌంట్‌లో నుంచి తొలగిపోయినట్లు ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆయనకు గుండె ఆగినంత పనైంది. బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించి విషయం తెలియజేశారు. పరిశీలిస్తామని మేనేజర్‌ సమాధానం చెప్పారు.

చదువురాని వారే టార్గెట్‌..
చదువురాని వారిని వారి మాటల ఆధారంగా అంచనా వేస్తారు. అటు పిమ్మట పూర్తి వివరాలను రాబడతారు. అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా తమపని కానిచ్చేస్తున్నారు. వీరు ప్రధానంగా డ్వాక్రా మహిళలు, ఉపాధి సిబ్బంది, గ్రామీణ మహిళలు, దుకాణాలు నిర్వహిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు.

ఫోన్‌ చేశారు... నగదు పోయింది
సోమవారం ఉదయం 7 గంటలకు ఎస్‌బీహెచ్‌ మేనేజర్‌ రామచంద్రారెడ్డిని అంటూ 970906564 నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మీ ఖాతా నిలిపివేయబడింది. మీ ఖాతా నంబర్, ఏటీఎం కార్డు నంబర్, పిన్‌ నంబర్‌ చెప్పమని’ అడిగారు. తెలియజేశాను. 10 నిమిషాల్లోనే ఖాతాలోని నగదు పూర్తిగా మాయమైం ది. ఖాతాలో ఉన్న రూ.30 వేలు చోరీ చేశారు.
– శేఖర్, కాణిపాకం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అడ్రస్‌ లేని నంబర్లతో ఫోన్‌ చేసి నగదు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. కాణిపాకం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు, ఫైనాన్స్, లక్కీ డ్రా, లాటరీ సెంటర్ల నుంచి ఫోను చేస్తున్నట్లుగా చెబితే వివరాలు చెప్పొద్దు. అప్రమత్తంగా ఉండాలి.
–ఎత్తిరాజులు, కాణిపాకం ఏఎస్‌ఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement