పుష్కరఘాట్లను పరిశీలించిన ఎస్పీ | sp visit to pushkara ghats | Sakshi
Sakshi News home page

పుష్కరఘాట్లను పరిశీలించిన ఎస్పీ

Jul 17 2016 8:21 PM | Updated on Sep 4 2017 5:07 AM

బీచుపల్లి కృష్ణానది ఒడ్డున పుష్కరఘాట్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ రాజేశ్వరి

బీచుపల్లి కృష్ణానది ఒడ్డున పుష్కరఘాట్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ రాజేశ్వరి

కృష్ణా పుష్కరాల సందర్భంగా బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ల నిర్మాణాలను ఆదివారం ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించారు. ఆలయాల పరిసరాలను, పుష్కరాల సందర్భంగా వీఐపీ వాహనాల పార్కింగ్, వీఐపీ పుష్కరఘాట్లను పరిశీలించారు.

ఇటిక్యాల /గద్వాలన్యూటౌన్‌/ఆత్మకూర్‌ :  కృష్ణా పుష్కరాల సందర్భంగా బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ల నిర్మాణాలను ఆదివారం ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించారు. ఆలయాల పరిసరాలను, పుష్కరాల సందర్భంగా వీఐపీ వాహనాల పార్కింగ్, వీఐపీ పుష్కరఘాట్లను పరిశీలించారు. బీచుపల్లి పుణ్యక్షేత్రం పరిసరాలలో, కృష్ణానది అవతల రంగాపురం నుంచి ఇటిక్యాల మండలం ఎర్రవల్లిచౌరస్తా వరకు జాతీయ రహదారి వెంబడి పటిష్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని స్థానిక డీఎస్పీ బాలకోటి, అలంపూర్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఇటిక్యాల ఎస్‌ఐ సురేష్‌కు సూచించారు. పుష్కరాల సందర్భంగా బీచుపల్లి పుణ్యక్షేత్రానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, భద్రత విషయంలో రాజీ పడవద్ద చెప్పారు. వీఐపి వాహన పార్కింగ్‌ స్థలాల వద్ద, భక్తుల పార్కింగ్‌ స్థలాల వద్ద విద్యుత్‌ బల్బులు, సీసి కెమెరాల ఏర్పాటు పనులు త్వరగా పూర్తిచేసేలా చూడాలని ఆదేశించారు. 
 రోడ్డుమార్గాల మ్యాప్‌లతో అధికారులతో చర్చ 
అనంతరం గద్వాలరూరల్‌ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. అనంతరం గద్వాల ప్రాంతంలోని పుష్కరఘాట్ల రోడ్డు మార్గాలపై అధికారులతో చర్చించారు. కర్నూలు నుంచి బస్సుమార్గం ద్వారా వచ్చే భక్తులు గద్వాల మండల పరిధిలోని బీరెల్లి పుష్కరఘాట్‌కు వెళ్లే మార్గాన్ని, రైలుమార్గం ద్వారా కర్నూలువైపు నుంచి నదీఅగ్రహారం పుష్కరఘాట్‌కు వెళ్లే రోడ్డు మార్గాలను మ్యాప్‌ల ద్వారా సీఐ సురేష్‌ వివరించారు. తర్వాత నది అగ్రహారం పుష్కరఘాట్‌ను సందర్శించారు. అక్కడి పనుల పురోగతి గురించి ఎస్పీ తెలుసుకున్నారు. షాద్‌నగర్‌ ఏఎస్పీ కల్మేశ్వర్‌ సింగెనవర్, గద్వాల డీఎస్పీ బాలకోటి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రొఫెసర్‌ ప్రసన్నకుమార్, పలువురు ఎస్‌ఐలు సిబ్బంది ఉన్నారు. 
నందిమల్ల పుష్కరఘాట్‌ను సందర్శన 
అక్కడి నుంచి ఆత్మకూర్‌ మండలంలోని నందిమల్ల పుష్కరఘాట్‌ను ఎస్పీ సందర్శించారు. ఏర్పాట్ల గురించి అధికారులతో అడిగి తెలుసుకున్నారు. జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో తదితర వివరాల గురించి ఆరా తీశారు. ఘాట్ల వద్ద ప్రత్యేక సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు పెద్దఎత్తున పోలీసుబలగాలను మోహరించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఐ సీహెచ్‌ రాజు, ఏపీఎం శ్రీనివాసులు, సర్పంచ్‌ రంగమ్మ, ఎంపీటీసీ లక్ష్మమ్మ, కాంట్రాక్టర్లు ప్రతాప్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మస్తీపూర్‌ శ్రీను, సర్వేయర్‌ బాస్కర్‌ ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement