అనర్హులకు పింఛన్లు | some pensioners are not eligible | Sakshi
Sakshi News home page

అనర్హులకు పింఛన్లు

Sep 3 2016 10:51 PM | Updated on Mar 21 2019 8:35 PM

నగర పంచాయతీ, మున్సిపాల్టీల్లో అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు ఆరోపణలు రావడంతో ముందుగా జోగిపేట నగర పంచాయతీ పరిధిలో విచారణ చేపట్టాలని కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఆదేశించారు.

  • విచారణ చేపట్టాలంటూ కలెక్టర్‌ ఆదేశం
  • జోగిపేట: నగర పంచాయతీ, మున్సిపాల్టీల్లో అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు ఆరోపణలు రావడంతో ముందుగా జోగిపేట నగర పంచాయతీ పరిధిలో విచారణ చేపట్టాలని కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఆదేశించారు. పింఛన్ల విషయమై గత రెండు రోజులుగా 10 మంది డీఆర్‌డీఏ సిబ్బంది వార్డులవారీగా ఇంటింటికి వెళ్లి విచారణ చేపడుతున్నారు.

    శనివారం జోగిపేటలోని  19వ వార్డులో విచారణకు వెళ్లిన సిబ్బందిపై ఆ ప్రాంతానికి చెందిన వారు కొందరు దాడి చేసి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ విషయాన్ని డీఆర్‌డీఏ ఏపీఓ విజయలక్ష్మి ధ్రువీకరించారు.  విచారణను పట్టణంలో పెన్షన్‌ పొందుతున్న కొందరు వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది విచారణకు ముందుకురాకుండా తప్పించుకుంటున్నారు.

    వితంతు పెన్షన్లు పొందుతున్న వారి వద్దకు వెళ్లి భర్త చనిపోయినట్లు సర్టిఫికెట్లు తేవాలని , వికలాంగులకు  సదరెం క్యాంపు సర్టిఫికెట్లు చూపాలని కోరినా చాలా మంది చూపించడంలేదని తెలిసింది. దీనిని బట్టి జోగిపేటలో  పెద్ద సంఖ్యలో పెన్షన్లను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
     

    సిబ్బందిపై దాడి చేశారు : ఏపీఓ విజయలక్ష్మి
    కలెక్టర్‌ ఆదేశానుసారం జోగిపేటలో  రెండు రోజులుగా డీఆర్‌డీఏ సిబ్బంది పెన్షన్లపై విచారణ జరుపుతున్నారని, పట్టణంలోని 19వ వార్డులో సిబ్బందిపై దాడి చేసినట్లు వారు తమకు సమాచారం ఇచ్చారన్నారు. పట్టణంలో బోగస్‌ పెన్షన్లు  ఉన్నట్లు కలెక్టర్‌ దృష్టికి రావడంతో  జోగిపేట నుంచే విచారణ మొదలైందన్నారు. వారం రోజుల్లో విచారణ పూర్తి కాగానే కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామన్నారు.

    దీని తర్వాత సంగారెడ్డి మున్సిపాలిటీలో కూడా పెన్షన్‌లపై విచారణ జరుపుతామని తెలిపారు. స్థానికంగా 1వ వార్డులో భర్త చనిపోయినట్లు మహిళ పెన్షన్‌ పొందుతుండగా  భర్త 9వ వార్డులో వృద్ధాప్య పెన్షన్‌ పొందుతున్నట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు వచ్చిందన్నారు. నగర పంచాయతీలో 2842 పెన్షన్‌లు ఉన్నాయని, ఇందులో వృద్యాప్య పెన్షన్‌లు 1260, చేనేత కార్మికులు 113, వితంతు 1193, వికలాంగులు 225, కల్లుగీత కార్మికులు 51 మంది పెన్షన్‌లు పొందుతున్నారన్నారు.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement