మీకు సిగ్గూ, శరం ఉందా!
‘వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి లేదు. పూర్తయిన వాటికీ జియోట్యాగింగ్ చేయడం లేదు. వారికి బిల్లులు చెల్లించడం లేదు. మీ శాఖలో ఇంత మంది ఉన్నారు ఎందుకు..? మీకసలు సిగ్గూ, శరం ఉందా...!’ అని డ్వామా సిబ్బందిపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మండిపడ్డారు.
–డ్వామా సిబ్బందిపై జిల్లా కలెక్టర్ ఫైర్
–వ్యక్తిగత మరుగుదొడ్ల పురోగతి లేదు
– పూర్తయిన వాటికి డబ్బులు ఇవ్వరు
– ఇలాగైతే సస్పెండ్ చేస్తా
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
కర్నూలు(హాస్పిటల్): ‘వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి లేదు. పూర్తయిన వాటికీ జియోట్యాగింగ్ చేయడం లేదు. వారికి బిల్లులు చెల్లించడం లేదు. మీ శాఖలో ఇంత మంది ఉన్నారు ఎందుకు..? మీకసలు సిగ్గూ, శరం ఉందా...!’ అని డ్వామా సిబ్బందిపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మండిపడ్డారు. బహిరంగ మలవిసర్జనలేని గ్రామాలను తయారు చేసేందుకు ఉద్దేశించిన ఓడీఎఫ్ గ్రామాలపై సీఆర్పీలతో జిల్లా కలెక్టర్ బుధవారం సునయన ఆడిటోరియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్∙విజయమోహన్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన మళ్లీ సమావేశం నిర్వహిస్తానని, అప్పుడు ఎవరైనా వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు పెండింగ్ పెట్టుకుని, జియోట్యాగింగ్ చేయకుండా వంటి కారణాలతో వస్తే ఇక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రోత్సహించే సీఆర్పీలకు ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. మొదటి బ్యాచ్లో ఉన్న వారికి పారితోషికాన్ని రోజుకు రూ.400 నుంచి రూ.500 కు పెంచుతున్నట్లు ప్రకటించారు. 50 శాతం ఓడీఎఫ్ గ్రామాలు దాటితే మరింత పారితోషికం పెంచుతామన్నారు. వ్యక్తిగత ప్రతిభను బట్టి సీఆర్పీలకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. వితంతువులు, వికలాంగులకు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కష్టపడి, చిత్తశుద్ధితతో పనిచేయాలని హితవు పలికారు. సమావేశంలో ఏపీడీ సులోచన, డ్వామా సిబ్బంది పాల్గొన్నారు.