సీజనల్ వ్యాధుల పంజా!
రామగుండం కార్పొరేషన్ ప్రజలను సీజనల్ వ్యాధులు వణికిస్తున్నాయి. మూడు రోజులుగా డయేరియా లక్షణాలు, జ్వరంతో జనం ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్నారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో అడ్మిట్ అవుతున్నారు. దీంతో మంచాలు సరిపోకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది వరండాలో మంచాలు వేసి చికిత్స అందిస్తున్నారు.
-
బల్దియా, సింగరేణిలో లోపించిన పారిశుధ్యం
-
పెరుగుతున్న డయేరియా బాధితులు
-
పొంచి ఉన్న ప్రాణాంతక వ్యాధులు
-
చోద్యం చూస్తున్న పాలకులు, అధికారులు
కోల్సిటీ : రామగుండం కార్పొరేషన్ ప్రజలను సీజనల్ వ్యాధులు వణికిస్తున్నాయి. మూడు రోజులుగా డయేరియా లక్షణాలు, జ్వరంతో జనం ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్నారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో అడ్మిట్ అవుతున్నారు. దీంతో మంచాలు సరిపోకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది వరండాలో మంచాలు వేసి చికిత్స అందిస్తున్నారు. నగంలోని పలు ప్రై వేట్ ఆస్పత్రులు సైతం రోగులతో కిటకిటలాడుతున్నాయి. బల్దియా, సింగరేణి అధికారులు నిర్లక్ష్యంతో పారిశుధ్యం లోపించి వ్యాధులు ప్రబలుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వణుకుతున్న కాలనీలు...
డయేరియా, జ్వరంతో నగరంలోని అనేక కాలనీలు వణుకుతున్నాయి. స్థానిక ఇందిరానగర్, జనగామ, రామగుండం, అశోక్నగర్, గాంధీనగర్, విఠల్నగర్, కేసీఆర్కాలనీ, చంద్రబాబుకాలనీ, గంగానగర్, మల్లిఖార్జున్నగర్, హనుమాన్నగర్, శివాజీనగర్, తిలక్నగర్, ఐబీకాలనీ, లక్ష్మీనగర్, ఎల్బీనగర్, రమేశ్నగర్ కాకతీయనగర్, అంబేద్కర్నగర్, పవర్హౌస్æకాలనీ, ౖయెటింక్లయిన్కాలనీ, జంగాలపల్లి తదితర ప్రాంతాలతోపాటు అంతర్గాం, ఎల్కలపల్లి, లక్ష్మీపురం, ముస్త్యాల నుంచి కూడా విషజ్వరాలతో రోగులు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వస్తున్నారు. ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరగడంతో అక్కడ కూడా పారిశుధ్యం లోపిస్తోంది.
మురికి వాడల్లో పరిస్థితి అధ్వానం
మురికివాడల్లో విషజ్వరాలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. కార్పొరేషన్లోని చాలా డివిజన్లలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు సింగరేణి సంస్థకు చెందిన క్వార్టర్ల ప్రాంతాలలో కూడా పారిశుధ్యంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాలువలు కంపుకొడుతున్నాయి. చెత్తకుప్పలు పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోంది. ఈగలు, దోమలు పెరిగిపోయాయి. పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. వర్షాలు కురుస్తున్నా పారిశుధ్యం మెరుగుపర్చకుండా బల్దియా, సింగరేణి అధికారులు చోద్యం చూస్తున్నారు. తాగునీటి లీకేజీలకు మరమ్మతులు పూర్తి చేయడం లేదు. గత్యంతరం లేక ప్రజలు కలుషిత నీరే తాగుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే డెంగీ, చికున్గన్యా, డయేరియా తదితర వ్యాధులు విజంభించే ప్రమాదం ఉందని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రోగుల అవస్థలు పట్టని వైద్యులు
గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్యాధికారుల నుంచి సిబ్బంది వరకు సమయపాలన పాటించడం లేదు. రోగులు ఉదయమే ఆస్పత్రికి వచ్చి పడిగాపులు కాస్తున్నా వారి అవస్థలు పట్టని వైద్యులు తాపీగా విధులకు హాజరవుతున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యులు 10 గంటలకు వచ్చారు. కార్యాలయ సిబ్బంది కూడా వారినే అనుసరించారు. ఒక్కరు అటెండర్ మినహా ఎవరూ సమయ పాలన పాటించలేదు. దీంతో జ్వరం, డయేరియా బాధితులు, గర్భిణులు, ఇతర సమస్యలతో ఆస్పత్రికి వచ్చిన వారు తల్లడిల్లిపోయారు.