ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం


శ్రీకాకుళం: నవంబర్‌ 6న జరిగే నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష–2016కు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, వసతి సౌకర్యం లేదని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని డీఈఓ దేవానందరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, డివిజనల్‌ హెడ్‌ క్వార్టర్స్‌ శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్ష రాసేందుకు 7వ తరగతిలో ఓసీ, బీసీ విద్యార్థులు 55 శాతం (బి గ్రేడు) మార్కులతో, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ విద్యార్థులు  50 శాతం (బీ గ్రేడ్‌) మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు.

 

తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ. 1.50 లక్షలు లోపు ఉండాలని, ఆదాయ ధ్రువ పత్రం తహశీల్దార్‌ జారీ చేసిన ఒరిజినల్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలని తెలిపారు. రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హత లేదని స్పష్టం చేశారు. పరీక్షకు దరఖాస్తు చేసే విద్యార్థులు కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, 7వ తరగతి మార్కుల జాబితా, ఆధార్‌ జిరాక్స్, ప్రింటెడ్‌ నామినల్‌ రోల్స్‌ రెండు కాపీలు సమర్పించాలని సూచించారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ విద్యార్థులు రూ. 50లు ఎస్‌బీఐ కలెక్ట్‌ సిస్టం ద్వారా చెల్లించాలని తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్‌ 14 అని, ఫీజు కట్టేందుకు 17వ తేదీగా తెలిపారు. కార్యాలయానికి 20వ తేదీలోగా అందజేయాలని సూచించారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top